హైడ్రా కమిషనర్ రంగనాథ్ తాజా ప్రకటన..!!
HYDRAA: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్.. ఈ మధ్యాహ్నం హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఆక్రమణలకు గురవుతున్నాయంటూ ఫిర్యాదులు అందిన చెరువులను సందర్శించారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులతో కలిసి అక్కడి తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
కొద్దిసేపటి కిందటే మూసాపేట్లోని కాముని చెరువు, మైసమ్మ చెరువులను సందర్శించారు. చెరువు స్థలం, బఫర్ జోన్, ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధి వంటి నిబంధనలను ఉల్లంగిస్తూ నిర్మించిన కట్టడాల గురించి ఆరా తీశారు. దీనికి సంబంధించిన పూర్తిస్థాయి నివేదికలను అందజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చెరువు ఆక్రమణలకు గురవుతోందని నిర్ధారించారు.

అనంతరం విలేకరులతో మాట్లాడారు. కాముని చెరువు ఆక్రమణలకు గురవుతోందంటూ అందిన ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకుని దీన్ని సందర్శించడానికి వచ్చామని అన్నారు. చెరువు పక్కనే గుడిని నిర్మించారని, అలాగే- భవన నిర్మాణాలకు సంబంధించిన వ్యర్థాలను తెచ్చి చెరువును పూడ్చుతున్నారని రంగనాథ్ చెప్పారు.
కాముని చెరువును ఆనుకుని గతంలో నిర్మితమైన ఇళ్లను తాము ఎట్టి పరిస్థితుల్లనూ కూలగొట్టబోమని, ఈ ఏడాది జులై తరువాత అంటే- హైడ్రా మనుగడలోకి వచ్చిన తరువాత వెలిసిన కట్టడాలను మాత్రం కూల్చివేస్తామని రంగనాథ్ తెలిపారు. ఈ విషయంలో అనుమతులు ఉన్నప్పటికీ కూల్చివేతలు తప్పవని తేల్చి చెప్పారు.
అనుమతులు ఉన్నా కూడా ఈ ఏడాది జులై తరువాత నిర్మించిన కట్టడాలను కూల్చివేయాల్సిందేనంటూ ప్రభుత్వం స్పష్టం చేసిందని, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న వాటినీ తొలగించక తప్పదని రంగనాథ్ అన్నారు. చెరువులను పరిరక్షించడానికి ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలకు అనుగుణంగా తాము పని చేస్తామని పేర్కొన్నారు.
హైడ్రా కమిషనర్ తాజా ప్రకటన..!!#Ranganath #HYDRA #HYDRACommissioner #TelanganaGovt #Oneindiatelugu pic.twitter.com/Rb9GckYtrN
— oneindiatelugu (@oneindiatelugu) December 17, 2024
అనుమతులు ఉన్నా, లేకపోయినా- ఈ ఏడాది జులై కంటే ముందు కట్టుకున్న ఇళ్లు, ఇతర కట్టడాలను మాత్రం కూలగొట్టబోమని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరైనా వచ్చి దుష్ప్రచారం చేసినా నమ్మొద్దని రంగనాథ్ విజ్ఞప్తి చేశారు. ఎప్పుడో కట్టుకున్న పాత నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications