పవన్ ఆదేశిస్తే ఎక్కడినుండైనా పోటీకి సిద్దం:వేణు మాధవ్
హైదరాబాద్: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే తాను ఎక్కడినుండైనా పోటీ చేయడానికి సిద్దంగా ఉన్నానని సినీ నటుడు వేణు మాధవ్ చెప్పారు. 2019 ఎన్నికల్లో టిడిపి, జనసేన పార్టీలు కలిసే పోటీ చేస్తాయని వేణుమాధవ్ అభిప్రాయపడ్డారు.
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ని కలిసేందుకు జనసేన కార్యాలయానికి హాస్యనటుడు వేణుమాధవ్ సోమవారం వచ్చారు.
పవన్ కల్యాణ్కి కొత్త ధాన్యం ఇవ్వడానికి వచ్చానని సినీ నటుడు వేణు మాధవ్ చెప్పారు. పవన్కి కొత్త పంట బియ్యం ఇచ్చి, ఆయన తోటలో కాసిన మామిడి పండ్లను తీసుకెళ్లడం తనకు ఆనవాయితీ ఉందని వేణుమాధవ్ చెప్పారు.
పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి తన పూర్తి మద్దతు ఉంటుందని వేణు మాధవ్ తెలిపారు. పవన్ కనుక ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేయడానికి సిద్ధమన్నారు వేణు మాధవ్. అయితే తెలుగుదేశం, జనసేన పార్టీలు 2019 ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.
అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. పవన్.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజా సమస్యలపై దృష్టి పెట్టడం మంచి పరిణామమని అని వేణుమాధవ్ తెలిపారు. అయితే వేణుమాధవ్ జనసేన కార్యాలయానికి వచ్చిన సమయంలో.. పవన్ అప్పుడే ఇంటికి వెళ్లారని చెప్పడంతో వేణుమాధవ్ నిరాశతో వెంటనే ఆ కార్యాలయం నుంచి వెనుదిరిగారు.