టీటీడీపీలో కుమ్ములాటలు: రేవంత్ దూకుడు, సీనియర్లు కినుక
హైదరాబాద్: టీడీపీ ఎమ్మెల్యే, తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి దూకుడు ఆ పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు దారి తీశాయి. పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దీంతో పార్టీలో ఆధిపత్య పోరుతో కార్యకర్తలు, శ్రేణులు సతమతమవుతున్నాయి.

మొక్కబడి కార్యక్రమాలపై అసంతృప్తి
పార్టీ సాగుతున్న తీరు, మొక్కబడి కార్యక్రమాలపై అసంతృప్తి
ముఖ్యనేతల తీరుతో రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల్లో వీరిద్దరిలో ఎవరిని సమర్థించాలో, ఎవరితో పాటు కలసి ముందుకు సాగాలో తెలియక నాయకులు, కార్యకర్తలు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. విభజన అనంతరం తెలంగాణలో టీడీపీ తన పూర్వ వైభవాన్ని కోల్పోయింది. అంతేకాదు రాష్ట్రంలో పార్టీ సాగుతున్న తీరు, మొక్కబడి కార్యక్రమాల పట్ల పలువురు నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నా తగిన ప్రోత్సాహం, గుర్తింపు లభించకపోవడం పట్ల సీనియర్ నేతల్లో నిరాశలో ఉన్నారు.

రేవంత్ దూకుడుపై సీనియర్లు కినుక
తెలంగాణ టీడీపీలో రేవంత్ రెడ్డికి ప్రాధాన్యం పెరుగుతున్న మాట వాస్తవం. ఇది కొందరు సీనియర్లతో పాటు రాష్ట్రస్థాయి ముఖ్యనేతలు, జిల్లాస్థాయిల్లోని నాయకులకు సైతం నచ్చడం లేదు. ముఖ్యంగా రేవంత్రెడ్డి దుందుడుకు వైఖరి, ఆయా సమస్యలు, అంశాలపై స్పందిస్తున్న తీరును కూడా పార్టీ నాయకులు తప్పుబడుతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఓటుకు నోటు కేసు తెలంగాణలో పార్టీకి రాజకీయ మనుగడ ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యాన్ని సైతం పార్టీ నాయకులు గుర్తు చేసుకుంటున్నారు.

సీనియర్లు తమ రాజకీయ భవితవ్యంపై తీవ్ర ఆందోళన
2019 ఎన్నికలే లక్ష్యంగా టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు. రాష్ట్రంలో పార్టీకి పూర్వ వైభవం తీసుకు రావాలంటే యువ రక్తం అవసరం అని భావిస్తున్నారు. దీంతో మహబూబ్నగర్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం తదితర జిల్లాల్లో ముఖ్యనేతలు, సీనియర్ నాయకులు సైతం తమ రాజకీయ భవితవ్యంపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అటు టీఆర్ఎస్లో చేరేందుకు అవకాశం లేక, ఇటు కాంగ్రెస్లోనో, బీజేపీలోనో చేరలేక మల్లగుల్లాలు పడుతున్నారు.

జిల్లాస్థాయిల్లోనూ పార్టీ నేతల నియంత్రణ
కష్టకాలంలో పార్టీ వెంట ఉండి నడుస్తున్నా, క్రమం తప్పకుండా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా జిల్లా స్థాయిలో కూడా ఎదగకుండా పార్టీ ముఖ్యనేతలు ఎక్కడికక్కడ నియంత్రించడం పట్ల కూడా విమర్శలు వస్తున్నాయి. ఇటీవల తెలుగు యువతతో పాటు వివిధ అనుబంధ రాష్ట్ర కమిటీల ఏర్పాటు, ఆయా పదవుల నియామకాల్లో సీనియర్లకు తగిన ప్రాధాన్యం దక్కిన సంగతి తెలిసిందే. దీంతో పార్టీలో అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా రగులుతోంది. ‘జంబో కమిటీ'ల్లోనూ పార్టీని నమ్ముకున్న వారికి తగిన ప్రాధాన్యం లభించకపోవడం విశేషం.












Click it and Unblock the Notifications