చంద్రబాబు లేక ఏడుస్తుంటే.. నీకేమైంది?: కేసీఆర్పై జైపాల్ నిప్పులు
ముఖ్యమంత్రి కేసీఆర్, బీజేపీ నేతలపై సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, బీజేపీ నేతలపై సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మరోసారి అధికారంలోకి రావడం కోసం కేసీఆర్ అడ్డగోలు హామీలన్నీ ఇస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి వస్తున్న ఆదాయాన్ని దుబారాగా ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.
శనివారం ఆయన మాట్లాడుతూ.. సెక్రటేరియట్ కూడా లేదని ఓ వైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏడుస్తుంటే.. ఉన్న సచివాలయాన్ని కూల్చేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త సెక్రటేరియట్ వల్ల ప్రయోజనం ఏముందని ప్రశ్నించారు.
దీని వల్ల ప్రజలకు ఉపయోగం లేదు కానీ, కేసీఆర్ మాత్రం ఇది పండగేనని ఎద్దేవా చేశారు. పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో జనజీవనం అతలాకుతలమైందని జైపాల్ రెడ్డి అన్నారు. ప్రజలను ఈ విధంగా బాధించే అధికారం ఏ ప్రధానికీ లేదన్నారు.
ముడి చమురు ధర పెరిగిందనే కారణంతో ఎప్పటికప్పుడు పెట్రోలు ధరలను పెంచుతున్నారని, ముడి చమురు ధరలు తగ్గినప్పుడు మాత్రం పెట్రోలు ధరలను తగ్గించడం లేదని మండిపడ్డారు. పెట్రోలు ధరలు తగ్గించకపోవడం వల్ల కేంద్రానికి రూ.20వేల కోట్లు ఆదా అయ్యిందని జైపాల్ రెడ్డి తెలిపారు.