‘ఎన్నో అవమానాలు, కోదండరాం ‘రెడ్డి’ అని తెలీదు’: కేసీఆర్ సర్కారుపై ఫైర్
హైదరాబాద్: ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకంగా టిఆర్ఎస్ ప్రభుత్వం నడుచుకుంటోందని కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే జానారెడ్డి అన్నారు. తార్నాకలోని తన నివాసంలో మౌనదీక్ష చేస్తున్న తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరాంకు కాంగ్రెస్ మద్దతు తెలిపింది. కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, గీతారెడ్డి, డీకే అరుణ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలతోపాటు ఎమ్మెల్యేలు, నేతలు కోదండరాం దీక్షలో పాల్గొన్నారు.
రాష్ట్ర
సాధన
కోసం
కోదండరాం
ఎంతో
చేశారని
ఈ
సందర్భంగా
జానారెడ్డి
తెలిపారు.
తెలంగాణ
సాధించుకున్న
తర్వాత
అన్ని
విధాలా
అభివృద్ధి
జరుగుతుందని
అనుకున్నప్పటికీ
అలా
జరగడం
లేదని,
ఇది
బాధాకరమైన
విషయమని
అన్నారు.
ఇప్పుడు
అధికారంలో
ఉన్నామని
అణగదొక్కడం
సరికాదని
అన్నారు.
అణచివేత, అప్రజాస్వామికం
రాష్ట్రం సాధించుకున్న తర్వాత కూడా అరెస్టులు చోటు చేసుకోవడం విచారకరమని అన్నారు. అణచివేత, అప్రజాస్వామిక దోరణితో వ్యవహరించడం సరికాదని అన్నారు. ప్రజల సమస్యలపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ప్రజలకు న్యాయం చేయాలని జానారెడ్డి కోరారు. తెలంగాణ కోసం కోదండరాం ఆధ్వర్యంలో సకలజనుల సమ్మె, మానవహారంలు జరిగాయని చెప్పారు. తమను ఎంత అవమానించినా తెలంగాణ రాష్ట్రం కోసం భరించామని జానారెడ్డి తెలిపారు. అప్పటి ప్రభుత్వం మానవహారానికి అనుమతివ్వకుంటే.. ప్రభుత్వాన్ని కూలదోస్తామని సీఎంకు హెచ్చరించామని చెప్పారు.
రెడ్డి అని తెలియదు
ఇప్పుడు తెలంగాణ వచ్చినా కూడా సభలు, సమావేశాలకు అనుమతులివ్వరా? అంటూ నిలదీశారు. కోదండరాం లాంటి వ్యక్తులకు ధర్నా చేసుకునేందుకు అనుమతివ్వకపోవడం సరికాదన్నారు. కోదండరాం తమను మద్దతు కోరలేదని, ప్రజల కోసమే తాము కోదండరాం దీక్షకు మద్దతు పలుకుతున్నామని చెప్పారు. కోదండరాంను కులం పేరుతో నిందించడం సరికాదన్నారు. కోదండ రాం.. రెడ్డి అని కూడా తనకు తెలియదని, కేసీఆర్ చెబితేనే తనకు తెలిసిందని అన్నారు.
ప్రతిపక్షాల గొంతునొక్కుతున్నారు: ఉత్తమ్
తెలంగాణలో బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రతిపక్షాలు అభివృద్ధికి అడ్డుపడుతున్నట్లు చిత్రీకరిస్తోందని టిఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రజలకు అన్యాయం జరుగుతున్నందునే తాము మాట్లాడుతున్నామని తెలిపారు. మార్కెట్ విలువకు తగ్గకుండా భూ నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల గొంతునొక్కి శాసనసభను నడుపుతున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. స్పీకర్ కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అందుకే సభను వాకౌట్ చేశామని తెలిపారు. 2013భూసేకరణ చట్టంను అమలు చేయాలని కోరారు. భూముల ధరలను అప్ డేట్ చేశాకే సేకరణ ప్రారంభించాలని అన్నారు.
రేపు నిరసన ప్రదర్శనలు: కోదండరాం
భూసేకరణ చట్టంలో మార్పులు చేయాలని ప్రొఫెసర్ కోదండరాం ప్రభుత్వాన్ని కోరారు. అరెస్ట్ చేసిన జేఏసీ నేతలను విడుదల చేసే వరకు తన మౌనదీక్షను కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు. అరెస్ట్ చేసి రాత్రంతా వారిని చలిలోనే ఉంచారని చెప్పారు. తాము ఎక్కడా దాడులకు పాల్పడలేదని చెప్పారు. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని కోదండరాం అన్నారు. జేఏసీ నాయకుల అరెస్టులతో దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఇందుకు నిరసనగా శుక్రవారం మండల కేంద్రాలు, జిల్లా కలెక్టరేట్ల ఎదుట ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వినతి పత్రాలు కూడా సమర్పిస్తామని తెలిపారు.