నాగరాజును పొట్టన పెట్టుకున్న క్యాన్సర్ వ్యాధి
హైదరాబాద్: ప్రముఖ జర్నలిస్టు కొప్పుల నాగరాజు (33) కన్నుమూశారు. గత కొద్దికాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ నాగరాజు ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో హైదరాబాద్ లాలాపేటలోని జనప్రియ అపార్టుమెంట్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయాన్ని స్వంత గ్రామం ఖమ్మం జిల్లా భద్రాచలం సమీపంలోని సారపాకకు తరలించారు. ఆయన అంత్యక్రియలు సోమవారం నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
ఖమ్మం జిల్లా ఏజెన్సీ ఏరియాలోని అతిసామాన్య దళిత కుటుంబంలో నాగరాజు జన్మించారు. చిన్నతనంలో భద్రాచలంలో వికాస్ ఆర్ట్స్ పేరుతో పెయింటింగ్ షాపు నిర్వహించారు. అనంతరం హైదరాబాద్కు చేరుకున్న ఆయన కేంద్రీయ విశ్వవిద్యాలయం, బెంగళూరులోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జర్నలిజంలో పాత్రికేయ విద్యను, తెహల్కాలో సృజనాత్మక రచన కోర్సు పూర్తిచేసి ఇండియన్ ఎక్స్ప్రెస్లో జర్నలిస్టుగా సేవలందించారు.

పిన్నవయస్సులోనే జర్నలిస్టుగా జాతీయస్థాయికి ఎదిగిన నాగరాజు ఇకలేరన్న వార్తతో పాత్రికేయ, రాజకీయ, విద్యారంగాలకు చెందిన పలువురు దిగ్భ్రాంతికి లోనయ్యారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ మృత్యువుతో పోరాడుతున్న ఆయనకు మెరుగైన వైద్యం అందించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.8 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం తరఫున అందించారు.
ఆర్థిక సహాయాన్ని మంత్రి పద్మారావు, ప్రెస్అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఇటీవల ఆయన కుటుంబానికి అందజేశారు. ఆయన పార్థివదేహానికి ప్రజాగాయకుడు గద్దర్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి శ్రద్దాంజలి ఘటించి, కుటుంబసభ్యులను పరామర్శించారు.












Click it and Unblock the Notifications