దిక్కుమాలిన సమ్మెలు: సమర్థించుకున్న కెసిఆర్, ఇక పదవుల పందేరం
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఇక పదవుల పంపకం ప్రారంభించనున్నారు. నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయడానికి ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారు. ఆగస్టు 15వ తేదీ తర్వాత ఆయన పదవుల పంపకాన్ని చేపట్టనున్నారు. బుధవారం జరిగిన తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా పక్షం (టిఆర్ఎస్ఎల్పీ) సమావేశంలో ఆయన ఈ విషయాలపై మాట్లాడారు.
తెలంగాణలోని 12 కార్పోరేషన్ల పాలక మండళ్ల నియామకాలకు ఆయన పచ్చజెండా ఊపారు. ఆగస్తు 15వ తేదీ తర్వాత ఆ నియమకాలు జరుగుతాయి. నియోజకవర్గం ఇంచార్జీలకు నామినేటెడ్ పోస్టుల భర్తీలో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. మార్కెట్, దేవాదాయ కమిటీల నియామాకాలకు జాబితాలు సిద్ధం చేయాలని ఆయన మంత్రులకు, శాసనసభ్యులకు సూచించారు.
పార్టీ జిల్లా, మండల స్థాయి కమిటీల నియామకానికి కూడా ఆగస్టు 15వ తేదీ తర్వాత జాబితాలు సిద్ధం చేయాలని ఆయన సూచించారు. రిజర్వేషన్ల ప్రకారమే కమిటీల చైర్మన్ల నియామకాలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. వీలైనన్ని ఎక్కువ స్మార్ట్ సిటీల జాబితాను తయారు చేయాలని ఆయన సూచించారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఎక్కువ స్మార్ట్ సిటీలను తెచ్చుకుందామని ఆయన చెప్పారు.

ఇదిలావుంటే, తెలంగాణ భవన్లో గ్రామజ్యోతిపై కెసిఆర్ టీఆర్ఎస్ నేతలతో సమీక్ష నిర్వహించారు.ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మండలానికి ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని కెసిఆర్ ఆదేశించారు. గ్రామజ్యోతిలో భాగంగా ప్రజలను చైతన్యవంతం చేసేందుకు ప్రజాప్రతినిధులు చురుగ్గా వ్యవహరించాలని సూచించారు.
ఈ నెల 17 నుంచి 23 వరకు గ్రామజ్యోతి కార్యక్రమం చేపట్టాలని పిలుపునిచ్చారు. సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని నామినేటెడ్ పోస్టుల భర్తీకి జాబితాలు తయారు చేయాలని ఆయన సూచించారు.
దిక్కుమాలిన సమ్మెలు అంటూ తాను చేసిన వ్యాఖ్యలను కేసీఆర్ సమర్థించుకున్నారు. ప్రతిపక్షాలు ప్రతి విషయాన్ని రాజకీయం చేయాలనుకోవడం బాధాకరమని కేసీఆర్ చెప్పారు. గ్రామజ్యోతిని పార్టీ పటిష్టానికి ఉపయోగించుకోవాలని సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు. అభివృద్ధి జరిగితే ప్రజలే మనవైపు వస్తారని ఆయన చెప్పారు.
సెప్టెంబర్ మొదటివారంలో తెలంగాణ శాసనసభా సమావేశాలు నిర్వహించాలని టిఆర్ఎస్ఎల్పీ నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశాల తర్వాత ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చైనా పర్యటనకు వెళ్తారు.












Click it and Unblock the Notifications