దిగొచ్చిన కేసీఆర్! ఆ 3 జిల్లాలకు ఓకే: కొత్త వాటితో ప్రయోజనాలెన్నో
హైదరాబాద్: జిల్లాల ఏర్పాటుపై జనగామ, సిరిసిల్ల, గద్వాలలో జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తగ్గారని చెప్పవచ్చు. ఆ జిల్లాల ఏర్పాటు పైన కేసీఆర్లో అనుకూలత వచ్చింది. అక్కడి వారని నారాజ్ చేయడం ఎందుకని మంత్రులు, తెరాస ఎమ్మెల్యేలతో వ్యాఖ్యానించారని తెలుస్తోంది.
తద్వారా తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు కేసీఆర్ సానుకూల సంకేతాలిచ్చారు. ఈ మూడు జిల్లాలు ఏర్పడితే కొత్త జిల్లాల సంఖ్య 20కి మొత్తం జిల్లాల సంఖ్య 30కి చేరుకుంటుంది. మహబూబ్నగర్ జిల్లాలోని గద్వాల, కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల, వరంగల్ జిల్లాలోని జనగామను జిల్లాలు చేయాలని డిమాండ్లు, ధర్నాలు, ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఈ ప్రతిపాదనలపై ఆదివారం జరిగిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, నేతల సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావించిన సీఎం.. ఈ మూడు ప్రాంతాల నుంచి బలమైన డిమాండ్లు ఉన్నందున వాటిని జిల్లాలు చేస్తే తప్పేంటి అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని తెలుస్తోంది.
ఈ ప్రతిపాదనలపై ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను తీసుకున్న సీఎం వాటిపై తానే తుది నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. మహబూబ్నగర్ జిల్లా నేతలతో సమావేశం సందర్భంగా సీఎం గద్వాలతో పాటు సిరిసిల్ల, జనగామల గురించి ప్రస్తావించారు.
ఇప్పటికే 17 కొత్త జిల్లాలు వస్తున్నాయని, ఆ తర్వాత మరో మూడు జిల్లాల గురించే గట్టి వాదన వినిపిస్తోందని, అక్కడి ప్రజలు ఆశలు పెట్టుకున్నారని, వారిని ఎందుకు నారాజ్ చేయాలని, అందరూ సంతోషంగా ఉండాలని, అరుణాచల్ ప్రదేశ్లో తొమ్మిదివేల మందికి ఓ జిల్లా ఉందని, ఈ మూడు అంతకన్నా తక్కువేం కాదని, వాటికి అవకాశమిస్తే ఎలా ఉంటుందని ఎమ్మెల్యేలను కేసీఆర్ అడిగారని తెలుస్తోంది.
హైపవర్ కమిటీ
జనగామ, సిరిసిల్ల, గద్వాల జిల్లాలను ఏర్పాటు చేయాలన్న ప్రజాప్రతినిధుల అభిప్రాయానికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించిన కేసీఆర్.. దీనిపై లోతైన చర్చలకు ఎంపీ కే కేశవ రావు నేతృత్వంలో హైపవర్ కమిటీని ఏర్పాటు చేశారని తెలుస్తోంది. కమిటీ సభ్యులను సోమవారం నిర్ణయిస్తారు. నాలుగైదు రోజుల్లో కమిటీ నివేదిక ఇవ్వనుంది.
ఆయా కేంద్రాలను జిల్లాలుగా చేసే పక్షంలో ఎంత జనాభా ఉండాలి? ఏయే మండలాలు కలపాలి? అనే సాంకేతిక అంశాలపై హైపవర్ కమిటీ అధ్యయనం చేస్తుంది. అధికారుల నుంచి మరో నివేదికను కూడా సీఎం తెప్పించుకోనున్నారని సమాచారం. ఈ రెండు నివేదికల ఆధారంగా సీఎం తుది నిర్ణయం తీసుకుంటారు. అయితే, ఆ మూడు జిల్లాల ఏర్పాటు కూడా ఖాయమంటున్నారు.
కొత్త ప్రతిపాదనలపై కలెక్టర్లకు ఆదేశాలు
గద్వాల, జనగామ, సిరిసిల్లలను కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయడానికి సీఎం నుంచి సానుకూల సంకేతాలు రావడంతో వీటి ఏర్పాటుపై నివేదికలివ్వాలని ప్రభుత్వం మహబూబ్నగర్, వరంగల్, కరీంనగర్ జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. సోమవారం కరీంనగర్, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, హైదరాబాద్ జిల్లాల సమావేశం జరగనుంది. ఇందులో సీఎం తుది నిర్ణయం వెల్లడించనున్నట్లు తెలిసింది.
కొత్త జిల్లాలతో లాభాలు..
కొత్త జిల్లాలు ఏర్పడితే కేంద్రం నుంచి నిధులు ఎక్కువ వస్తాయి. కొత్త జిల్లాల వల్ల ఉద్యోగులకు పలు ప్రయోజనాలు చేకూరనున్నాయి. కొత్త ఉద్యోగాల కారణంగా చాలామందికి పదోన్నతులు లభిస్తాయి. ఉద్యోగులంతా తమ స్వస్థలాలకు దగ్గరలో ఉంటూనే జిల్లా కేంద్రంలో విధులను నిర్వహించుకొనే సౌలభ్యం ఏర్పడుతుంది. ఇంటి అద్దె భత్యాలు ఇప్పటికంటే పెరిగే అవకాశం ఉంది.
జిల్లా కేంద్రం అనగానే పాఠశాలలు, కళాళాలలు, కోచింగ్ సెంటర్లు వంటివి వస్తాయి. కాబట్టి ఉద్యోగులు తమ పిల్లలని అక్కడే చదివించుకోవచ్చు. జిల్లాల పరిధి చిన్నగా ఉంటుంది కాబట్టి పని భారం తగ్గుతుంది. జిల్లా పరిధిలోని రాజకీయ నాయకులూ తగ్గుతారు కాబట్టి వారి ఒత్తిళ్లూ తగ్గుతాయి.