తెలంగాణా ఎన్నికలకు కేసీఆర్ అస్త్రం సిద్ధం.. కేంద్రంపై యుద్ధం వెనుక అసలు కథ ఇదే!!
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటినుంచే వచ్చే ఎన్నికలకు వ్యూహాన్ని రచిస్తున్నట్లు కనిపిస్తుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో రెండుసార్లు అధికారాన్ని చేజిక్కించుకుని కేసీఆర్, మూడోసారి అధికారం చేజిక్కించుకోవడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తుంది. తెలంగాణ ఎన్నికలకు కెసిఆర్ అస్త్రాన్ని రెడీ చేసుకున్నట్టు, కేంద్రంపై సాగించే సమరం వెనుక వచ్చే ఎన్నికలలో విజయం సాధించే వ్యూహం ఉన్నట్టు పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది.
ఎన్నికలకు కేసీఆర్ అస్త్రం .. మళ్ళీ తెలంగాణా సెంటిమెంట్
అసలు ఇంతకీ తెలంగాణ సీఎం కేసీఆర్ ఏ అస్త్రాన్ని నమ్ముకుని వచ్చే ఎన్నికలకు వెళ్ళబోతున్నారు అన్నది ఇప్పటికే రాజకీయ పార్టీలకు క్లారిటీ వచ్చింది. వచ్చే ఎన్నికల్లోనూ తెలంగాణ సెంటిమెంట్ అస్త్రాన్ని నమ్ముకుని ముందుకు వెళ్లాలని టిఆర్ఎస్ పార్టీ వ్యూహం ఖరారు చేసినట్లుగా కనిపిస్తుంది. వచ్చే ఎన్నికలలో ఏ అంశాన్ని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలి అన్నదానిపై ఇప్పటి వరకు రకరకాల ప్రయోగాలు చేసిన టిఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రంలో సాధించిన అభివృద్ధిని చూపించాలని భావించారు. ఇక దళిత బంధు, రైతుబంధు పథకం ద్వారా దళిత, రైతు వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేయాలని భావించారు.
రెండు సార్లు తెలంగాణా సెంటిమెంట్ తోనే గెలిచిన కేసీఆర్
రైతు అజెండాను హైలెట్ చేయాలని ప్రయత్నం చేశారు. ఇక ఇవేవీ ప్రజల్లోకి బలంగా వెళ్లడం లేదని గుర్తించిన కేసీఆర్ మళ్లీ పాత వ్యూహాన్ని వచ్చే ఎన్నికల్లోనూ వినియోగించే అవకాశం ఉందని తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లోనూ తెలంగాణ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించాలని కేసీఆర్ భావిస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జరిగినప్పుడు, ఉద్యమ పార్టీగా ఏర్పడిన టిఆర్ఎస్ వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని తెలంగాణ సెంటిమెంటుతో టిఆర్ఎస్ పార్టీకి ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారు. ఇక రెండవ సారి గెలిచినప్పుడు కూడా టిఆర్ఎస్ పార్టీకి విజయాన్ని అందించింది తెలంగాణ సెంటిమెంట్ నే.
మూడోసారి తెలంగాణా సెంటిమెంట్ .. ఈసారి సమరం కేంద్రంతో
గత ఎన్నికల సమయంలో ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణ ఎన్నికలలో పోటీ చేయడంతో, కెసిఆర్ దానిని తనకు అనుకూలంగా మలుచుకుని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. మళ్లీ ఆంధ్ర పాలకులు అంటూ చంద్రబాబుపై పెద్ద ఎత్తున ప్రచారం చేసి సెంటిమెంట్ తో ఘన విజయం సాధించారు. ఇక ఇప్పుడు కెసిఆర్ మళ్ళీ వచ్చే ఎన్నికలలోనూ లోకల్ సెంటిమెంట్ తోనే ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. అయితే ఈసారి పోరాటం మాత్రం ఆంధ్ర, తెలంగాణ వ్యవహారం లేదు కాబట్టి కేంద్రంతో మొదలు పెట్టారు.
తెలంగాణాపై కేంద్రం వివక్ష అంటూ సెంటిమెంట్ రగిల్చే పనిలో కేసీఆర్ .. వర్కవుట్ అవుతుందా?
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తుందని, తెలంగాణ ప్రజలు వివక్షకు గురవుతున్నారని స్వరాష్ట్ర పాలనలో కేంద్రం సహకరించక పోయినా అభివృద్ధి చేసి చూపించామని, జాతీయ పార్టీలు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయవని, ఎక్కడైనా పని జరగాలంటే సొంతోడే ఉండాలంటూ సెంటిమెంటును ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం చూపిస్తున్న వివక్షను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. రెండు దఫాలుగా ఎన్నికలలో తెలంగాణ ప్రజల సెంటిమెంట్ ను అస్త్రంగా వాడుకొని విజయం సాధిస్తున్న కేసీఆర్, వచ్చే ఎన్నికలలోనూ లోకల్ సెంటిమెంటే ఆయుధంగా మరోమారు ప్రజల్లోకి వెళుతున్నారు. ఏదిఏమైనా సీఎం కేసీఆర్ ఈ సారి తెలంగాణ సెంటిమెంటుతో విజయం సాధిస్తారా లేదా అన్నది ఆసక్తి రేకెత్తిస్తున్న విషయం.