ఉద్యమ నేతగా కెసిఆర్ హామీ, ఇప్పుడు ఇలాగా: మెట్రోపై కోఠిలో బంద్
హైదరాబాద్: మెట్రో కారిడార్ - 2 మార్గాన్ని మళ్లించి బడీచౌడీ మార్కెట్ను కాపాడాలని సుల్తాన్ బజార్, కోటి వ్యాపారుల సంఘం ఐక్య కార్యాచరణ సమితి మంగళవారం నాడు బందుకు పిలుపును ఇచ్చింది. ఉదయం నుంచి వ్యాపారులు దుకాణాలు మూసివేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. అప్పట్లో ఉద్యమ నేతగా ఉన్న నేటి సిఎం కేసీఆర్ తమ ఆందోళనకు మద్దతిచ్చి ఎట్టి పరిస్థితుల్లో మెట్రో నుంచి సుల్తాన్ బజార్, బడీచౌడీను కాపాడుతామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
కానీ ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యాక మెట్రో నుంచి కేవలం సుల్తాన్ బజార్ మార్కెట్ను మినహాయించే విధంగా మార్గాన్ని మళ్లిస్తామని చెప్పడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. బడీచౌడీ సుల్తాన్ బజార్లో ఒక భాగమన్నారు.
మెట్రో కారిడార్ - 2 మార్గాన్ని మళ్లించేంత వరకు ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఉద్యమ నేతగా ఉన్నప్పుడు కెసిఆర్ ఇచ్చిన హామీని... ఇప్పుడు నెరవేర్చుకోవాలన్నారు. పాత అలైన్మెంట్ ప్రతిపాదన వద్దని విజ్ఞప్తి చేశారు.