జాగ్రత్త! ఎంతవరకైనా వెళ్తా: బాబు 'ఎన్టీఆర్' వ్యాఖ్యపై కెసిఆర్ హెచ్చరిక
హైదరాబాద్: స్వర్గీయ ఎన్టీఆర్ హైదరాబాదు ప్రజలకు వేకువజామున నిద్ర లేవటం నేర్పారన్న ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యల పైన తెలంగాణ రాష్ట్ర సిఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం నాడు హెచ్చరించారు.
రవీంద్ర భారతిలో దాశరథి రంగాచార్య జయంతి వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో కెసిఆర్ పాల్గొని, ప్రసంగించారు. ఇప్పటికీ కొందరు తెలంగాణ పైన అక్కసు వెళ్లగక్కుతున్నారని చంద్రబాబును ఉద్దేశించి మండిపడ్డారు. తెలంగాణ ఇప్పుడు తన బతుకు తాను బతుకుతోందన్నారు.
దాశరథి వంటి వారు.. ఇంకా మనకు తెలియాల్సిన చరిత్రకారులు ఎందరో ఉన్నారని చెప్పారు. ఎన్టీఆర్ వచ్చాకే తెల్లవారి లేవడం హైదరాబాదువాసులు నేర్చుకున్నారని ఏపీ సీఎం చెప్పారని, అలాంటి వెకిలి మాటలు మాట్లాడితే ఎంత వరకైనా వెళ్తామని చంద్రబాబుకు హెచ్చరించారు.

తెలంగాణ సమాజాన్ని ఒక్క మాట అన్నా సహించమన్నారు. హైదరాబాద్ చారిత్రక నగరం అని చెప్పారు. ఎవరు కించపర్చినా దాశరథిలా గట్టిగా సమాధానం చెప్పాలన్నారు. మమ్మల్ని ఒక్క మాట అంటే మేం పదిమాటలు అంటామని ధ్వజమెత్తారు.
మీరు రాజధాని గొప్పగా కట్టుకోవాలన్నారు. మేం కూడా సంతోషిస్తామని చంద్రబాబుకు కెసిఆర్ సూచించారు. అయితే, తమ మానాన తమను బతకనివ్వాలన్నారు. అమరావతి గొప్ప రాజధానిగా కట్టుకొని, అక్కడి ప్రజలకు సేవ చేయండని సూచించారు. అంతేకానీ, హైదరాబాద్ జోలికి రావొద్దన్నారు.
400 ఏళ్ల ఘనమైన చరిత్ర ఉన్న హైదరాబాద్ నగరం ముందు ఇప్పటికే కాగితాల పైనే ఉన్న అమరావతి నగరం ఎంత గొప్పదన్న విషయాన్ని ఆంధ్రా మేధావులే ఆలోచించుకోవాలన్నారు.
తనను విమర్శిస్తే సహిస్తాను కానీ తెలంగాణను, హైదరాబాదును కించపరిస్తే ఊరుకునేది లేదన్నారు. తెలంగాణకు సంస్కృతి, సంస్కారం ఉన్నాయన్నారు. చంద్రబాబు హైదరాబాదును చూసి ఆసూయపడుతున్నారని, భ్రమలకు పోతున్నారన్నారు. వాటిని వదిలి పరజలకు సేవ చేయాలన్నారు.












Click it and Unblock the Notifications