జీహెచ్ఎంసీతో పాటే ఖమ్మం, వరంగల్కు ఎన్నికలు..!: రంగారెడ్డిలో కొత్తగా 5 మున్సిపాలిటీలు
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలతో పాటు ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్లకు కూడా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని సమాచారం. వచ్చే నెలలో జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.
దీంతో పాటే ఖమ్మం, వరంగలో కార్పోరేషన్లకు కూడా ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఖమ్మం కార్పోరేషన్లో 50, వరంగల్ కార్పోరేషన్లో 58 వార్డులుగా ఖరారు చేశారు.
కాగా జీహెచ్ఎంసీలో ఇప్పటికే వార్డుల విభజన పూర్తయ్యాయి. అదే విధంగా ఖమ్మం, వరంగల్ కార్పోరేషన్లకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ బీసీ కుల గణన కూడా పూర్తయిన సందర్భంగా జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటే ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఇది ఇలా ఉంటే రంగారెడ్డి జిల్లాలో నూతనంగా మరో ఐదు మున్సిపాలిటీలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జల్పల్లి, మీర్ పేట, జిల్లెలగూడ, బోడుప్పల్, ఫిర్జాదిగూడలను మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
అయితే ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో నిర్ణయాన్ని బయటకు వెల్లడించే అవకాశం లేకపోవడంతో ప్రభుత్వ ప్రకటనను వాయిదా వేసింది. ఎమ్మెల్సీ ఎన్నికలు కోడ్ ముగిసిన వెంటనే మున్సిపాలిటీల ప్రకటన వెలువడే అవకాశమున్నట్లు తెలుస్తోంది.