ఇక మీరే మాట్లాడాలి, అది పెద్ద జోక్: రాహుల్ను ఏకేసిన కేటీఆర్
కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సంగారెడ్డి ప్రజాగర్జనలో చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ఐటీ మంత్రి కేటీ రామారావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సంగారెడ్డి ప్రజాగర్జనలో చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ఐటీ మంత్రి కేటీ రామారావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కుటుంబపాలన గురించి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మాట్లాడటం ఈ దశాబ్దపు పెద్ద జోక్ అని ఎద్దేవా చేశారు.
ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన స్థానిక నాయకులు రాసిచ్చిన స్క్రిప్టుతో రాహుల్ గాంధీ ప్రసంగించారని, ఇది ఆ పార్టీ చౌకబారుతనానికి నిదర్శనమన్నారు. సంగారెడ్డి ప్రజాగర్జన సభలో కేసీఆర్ సర్కారుపై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించడంతో గురువారం రాత్రి కేసీఆర్ ట్వీట్టర్లో ధీటుగా కౌంటర్ ఇచ్చారు.
Indian Notional Congress leadership talking of 'family rule' has to be the joke of the millennium. Classic comedy 😀
— KTR (@KTRTRS) June 1, 2017
నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీల చిత్రాలను తన ట్వీట్లతో జత చేసి.. కాంగ్రెస్ పార్టీ వారా పాలన గురించి మాట్లాడుతున్నదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. సొంత ఇలాకాలో గెలవలేని సోకాల్డ్ జాతీయ నాయకులు ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస పార్టీని స్కాంగ్రెస్(కుంభకోణాల) పార్టీగా అభివర్ణిస్తూ.. 'స్కాంగ్రెస్ పార్టీకి ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉందా? దానిని మేం నమ్మాలా? దేశంలో ఎమర్జెన్సీ విధించిన ఘనత కాంగ్రెస్ పార్టీది కాదా? అవినీతి గురించి స్కాంగ్రెస్ లీడర్లు మాట్లాడటం పెద్ద జోక్' అంటూ విమర్శల వర్షం కురిపించారు కేటీఆర్.
తెలంగాణలో ఇప్పటికే ఐదు మొబైల్ ఫోన్ల కంపెనీలున్నాయని, మేడిన్ తెలంగాణ ఫోన్ కావాలంటే వెళ్లి వాస్తవాలు కనుక్కోవాలని రాహుల్ గాంధీకి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
కాగా, 'కేటీఆర్ పనితీరుపై తనకు గౌరవముందని, రాహుల్ గాంధీపై విమర్శలు చేసి ఎందుకు మీ స్థాయి ఎందుకు దిగజార్చుకుంటున్నారు' అని ఓ కాంగ్రెస్ కార్యకర్త.. కేటీఆర్కు ట్వీట్ చేశారు. దీనికి స్పందించిన కేటీఆర్.. 'నాకు కాంగ్రెస్ పార్టీపైగౌరవం లేదు. వారికి ఏమైనా సిద్ధాంతం ఉందా?' అని ప్రశ్నించారు.