నిప్పువా, కందిపప్పువా?: చంద్రబాబుపై కెటిఆర్ సెటైర్లు
మెదక్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తెలంగాణ మంత్రి కెటి రామారావు వ్యంగ్య బాణాలు విసిరారు. రాజకీయాల్లో తనను తాను చంద్రబాబు నిప్పులాంటి మనిషినని చెప్పుకుంటారని గుర్తు చేస్తూ ఇప్పుడు ఎసిబికి సహకరించి నిప్పువో, కందిపప్పువో నిరూపించుకోవాలని ఆయన అన్నారు. మెదక్ జిల్లా పర్యటనలో ఆయన శుక్రవారం ఆ విధంగా అన్నారు.
గతంలో స్టాంపుల కుంభకోణంలో కృష్ణ యాదవ్ను టిడిపి నుంచి సస్పెండ్ చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడినా ఎందుకు సస్పెండ్ చేయడం లేదని ఆయన అడిగారు. ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.
స్టాంపుల కుంభ కోణం కేసులో ఆరోపణలు రావడంతో ఆనాడు కృష్ణయాదవ్ను మంత్రి వర్గం నుంచి తొలగించావు కదా మరి ఇవాళ రేవంత్రెడ్డిని పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయడంలేదని మంత్రి ప్రశ్నించారు. దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
నీతులు, ఉపదేశాలు చెప్పడం కాదు వాటిని పాటించాలని ఆయన చంద్రబాబుకు సూచించారు. చంద్రబాబు తప్పు చేయకపోతే ఎందుకు తప్పించుకోవాలని చూస్తున్నారని నిలదీశారు. చంద్రబాబు విచారణను ఎదుర్కొని తన నిజాయితీని నిరూపించుకోవాలని సూచించారు. చట్టం ముందు అందరూ సమానులేనని అన్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా 76 శాతం పన్ను వసూలు చేశామని చెప్పారు. ప్రజల పన్నులతోనే ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుందన్నారు. త్వరలోనే పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం చేపడతామన్నారు. ఈ నెలలోనే రైతులకు రెండో దశ రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. రైతులకు కొత్త రుణాలు కూడా ఇస్తామన్నారు.