పెద్దల భయం: పురుగులమందు తాగి ప్రేమ జంట ఆత్మహత్య
కరీంనగర్: జిల్లాలోని పెద్దపల్లి శివారులో శనివారం విషాద సంఘటన చోటుచేసుకుంది. రెండేళ్లుగా ప్రేమించుకుంటున్న ఓ జంట పెళ్లి చేసుకోవాలని ఆరాటపడినా..పెద్దలను ఎదురించలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం...ఓదెల మండలం కొలనూరు గ్రామానికి చెందిన కేశెట్టి రాజయ్య కుమారుడైన కేశెట్టి క్రిష్ణమూర్తి అలియాస్ కిట్టు (27), మద్దెల వెంకటయ్య కుమార్తె మద్దెల మౌనిక (21) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కిట్టు ఆర్య వైశ్యడు కాగా, మౌనిక దళిత సామాజిక వర్గానికి చెందిన యువతి. వీరి ప్రేమ వ్యవహారాన్ని గ్రామంలోని మిత్రులు అంగీకరించినప్పటికీ కిట్టు తల్లిదండ్రులు నిరాకరించారు.
కుటుంబసభ్యులకు తెలియకుండా పెళ్లి చేసుకునేందుకు వేములవాడ మండలంలోని ఆగ్రహారం దేవాలయానికి వెళ్లారు. ఇంతలో ఇరువర్గాలకు చెందిన పెద్దమనుషులు పంచాయతీ నిర్వహించి పెళ్లిని అడ్డుకున్నారు. అయితే, మూడు రోజుల క్రితం స్థానిక కొలనూరు గ్రామంలోని ప్రియుడు ఇంటిముందు పెళ్లి చేసుకోవాలని ప్రియురాలు మౌనిక బైఠాయించి ఆందోళన చేపట్టింది.
కాగా, పోత్కపల్లి పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించి పెళ్లికి ఒప్పించారు. పెళ్లి ముహూర్తాన తల్లిదండ్రులు ఎక్కడ విడదీస్తారనే భయంతో ఆ ప్రేమ జంట శనివారం ఉదయం పెద్దపల్లి శివారు మంథని ప్లైఓవర్ సమీపంలో కూల్ డ్రింక్లో పురుగుల మందు కలుపుకొని తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న పెద్దపల్లి ఎస్సై రాజ్కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.