క్రూరం: భార్యపై అనుమానంతో చిన్నారిని చంపేశాడు
నల్లగొండ: భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి చిన్నారి పట్ల కాలయముడయ్యాడు. పాపం పుణ్యం ప్రపంచ మార్గం తెలియని చిన్నారిని కాటేశాడు. గాఢంగా నిద్రిస్తున్న 5నెలల పసిబిడ్డపను గొంతు నులిమి చంపేశాడు. తండ్రికి పాపను అప్పగించి తల్లి బయటికు వెళ్లింది.
ఆ పాపానికి ఆ బిడ్డ తనకు పుట్టలేదనే అనుమానంతో నులిమి చంపాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చండూరు మండల పరిధిలోని తేరటుపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బొట్ట ముత్తయ్య లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇతను 5ఏళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన ఇంద్రమ్మను ప్రేమ వివాహం చేసుకున్నాడు.
ఆ తర్వాత వారి కాపురంలో అనుమానాలు పెరిగాయి. దాంతో గొడవలు ప్రారంభమయ్యాయి. 5నెలల క్రితం వారికి ఆడపిల్ల పుట్టిన నాటి నుంచి ఆగ్రహంతో ఉన్న ముత్తయ్యకు మంగళవారం అవకాశం దొరికింది. తల్లి చంటిపాపను నిద్రపుచ్చి తండ్రికి అప్పగించి బట్టలు కొనేందుకు వెళ్లగా అప్పటికే భార్యపై అనుమానంతో ఉన్న ముత్తయ్య అదునుగా భావించి చంటిపాపని చూడకుండా 5నెలల పసికందును గొంతు నులిమి చంపి యథావిధిగా పడుకోబెట్టాడు.
కొద్ది సేపటికి వచ్చిన తల్లి ఇంద్రమ్మ పాలు పట్టించేందుకు లేపేసరికి స్పృహలేకుండా ఉండడంతో రోదిస్తూ పాపను బయటికి తీసుకెళ్లింది. గొంతుపై నల్లగా ఘాట్లు కన్పించడంతో తండ్రే చంపినట్టు తల్లి అనుమానిస్తుంది. దాంతో గ్రామస్తులు ఎస్ఐ మహిపాల్రెడ్డికి సమాచారం ఇచ్చారు. గ్రామానికి వచ్చిన ఎస్ఐ కుటుంబ సభ్యులను విచారించారు.
పోలీసుల విచారణలో ముత్తయ్య చిన్నారిని తానే చంపినట్లు ఒప్పుకోవడంతో పోలీస్స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.