తెలంగాణలో ప్రారంభమైన మినీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్: కరోనా నిబంధనలతో ఓటింగ్
హైదరాబాద్: తెలంగాణలో మినీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ శుక్రవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. వరంగల్ మహా నగర పాలక సంస్థ, ఖమ్మం మహానగర పాలక సంస్థ, సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు పురపాలక సంఘాలకు ఓటింగ్ జరుగుతోంది. పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరుగనుంది.
వీటితోపాటు మెట్పల్లి, అలంపూర్, జల్పల్లి, గజ్వేల్, నల్లగొండ, బెల్లంపల్లి, పరకాల, బోధన్లో ఒక్కో వార్డుకు ఉపఎన్నిక జరుగుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలోని లింగోజీగూడకు కూడా ఉపఎన్నిక పోలింగ్ జరుగుతోంది.
రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించింది. ఎన్నికల్లో హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా కరోనా నిబంధనలను పకడ్బంధీగా అమలు చేయాలని ఎస్ఈసీ పార్థసారథి ఆదేశించారు.

ఎన్నికల విధుల్లో ఉన్నవారు, ఓటర్లు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని స్పష్టం చేశారు. శానిటైజ్ చేసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రం లోపల, బయట కూడా భౌతిక దూరం పాటించాలన్నారు. కరోనా నిబంధనల అమలుకు ప్రతి మున్సిపల్ సంఘానికి ఒకరిద్దరు నోడల్ అధికారులను నియమించాలన్నారు.
Recommended Video
పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన ఆరోగ్య సిబ్బంది అవసరమైన మెడికల్ కిట్లతో సిద్ధంగా ఉండాలని ఎస్ఈసీ పార్థసారథి ఆదేశించారు. పోలింగ్ రోజున, కౌంటింగ్ రోజున గుంపులుగా ఉండకుండా చూసుకోవాలని సూచించారు. కౌంటింగ్ హాల్స్లో ఐదుకు మించి టేబుల్స్ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. రిటర్నింగ్ అధికారి నుంచి ఎన్నికైన ద్రువపత్రం అందుకోవడానికి అభ్యర్థితో పాటు మరొకరికి మాత్రమే అనుమతి ఇవ్వాలన్నారు.












Click it and Unblock the Notifications