జీవన్ రెడ్డి ఇలా చేస్తే ఎలా, మీకంటే యువకులం ఉన్నాం: కెటిఆర్ హెచ్చరిక
హైదరాబాద్: మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి, పదిహేనేళ్ల అనుభవం ఉండి, మంత్రిగా కూడా పనిచేసిన జీవన్ రెడ్డి దురుసుగా ప్రవర్తిస్తారని అనుకోలేదని తెలంగాణ మంత్రి కల్వకంట్ల తారక రామారావు ఆదివారం అసెంబ్లీలో అన్నారు.
జీవన్ రెడ్డి మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి సీటు వద్దకు వచ్చి కాగితాలు విసిరి కొట్టగా దీనిపై కెటిఆర్ మాట్లాడారు. జీవన్ రెడ్డి విచారం వ్యక్తం చేయాల్సిందేనని, ఆపైనే మాట్లాడే అవకాశం ఇవ్వాలని స్పీకర్ను కోరారు. జీవన్ రెడ్డి తప్పు చేసినప్పటికీ, జానారెడ్డి కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.
ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉంటే చర్చించాలని, అన్ని ప్రశ్నలకూ సమాధానం చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. మంత్రి వద్దకు వచ్చి పేపర్లు విసిరేయడం ఏం సంస్కృతి అన్నారు. సీనియర్ సభ్యుడు జీవన్ రెడ్డి ఇలా వ్యవహరిస్తే అంతకంటే యువకులైన సభ్యులం సభలో ఉన్నామని హెచ్చరించారు.

కాగా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆదివారం నాడు మంత్రి పోచారం వద్దకు వెళ్లి టేబుల్ పైన ఉన్న పేపర్లను విసిరివేశారు. దీంతో కాసేపు గందరగోళం నెలకొంది. కరవు పరిస్థితులపై సభలో చర్చ జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
కరవు మండలాల విషయంలో సీఎం కెసిఆర్ ద్వంద్వవైఖరిని ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. దీనిపై మంత్రి పోచారం అడ్డుకున్నారు. కాంగ్రెస్ సభ్యులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తిప్పికొట్టారు. ఈ సమయంలో జీవన్ రెడ్డి వేగంగా పోచారం వద్దకు వెళ్లి అన్నీ అబద్ధాలు చెబుతున్నారని అంటూ పేపర్లు విసిరేశారు.












Click it and Unblock the Notifications