చంద్రబాబు అరెస్ట్ బాధాకరం; ఏపీ ప్రభుత్వతీరు విచారకరం: తెలంగాణా మంత్రి తలసాని
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరెస్టుపై నేటికీ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా చంద్రబాబు అరెస్టుపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు.చంద్రబాబు అరెస్ట్ బాధాకరమని తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.
73 సంవత్సరాల వయసులో ఉన్న చంద్రబాబు నాయుడు ని అరెస్టు చేయడం, ఆయనని ఇబ్బందులకు గురి చేయడం బాధాకరమని పేర్కొన్న తలసాని, ఎక్స్ వేదికగా చంద్రబాబు అరెస్టు గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి, TDP అధినేత చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ చాలా బాధాకరం అన్న తలసాని ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడి గారి నాయకత్వంలో మంత్రిగా పని చేశాను అని గుర్తు చేసుకున్నారు.

వారి అరెస్ట్ వ్యక్తిగతంగా నాకెంతో బాధను కలగచేసింది అంటూ పేర్కొన్నారు. అధికారం శాశ్వతం కాదు అంటూ అభిప్రాయం వ్యక్తం చేసిన ఆయన, అధికారం కోసమే చంద్రబాబు ని ఇబ్బంది పెడుతున్నారనే అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు కేంద్ర రాజకీయాలలో కీలకపాత్ర పోషించిన సీనియర్ నాయకులు చంద్రబాబు నాయుడి గారి పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు విచారకరం అన్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్.
చంద్రబాబును 73 సంవత్సరాల వయసులో అరెస్ట్ చేయడం, విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేయడం సరికాదని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్టు పట్ల బీఆర్ఎస్ పార్టీ నేతలు ఒక్కొక్కరిగా నిదానంగా స్పందిస్తున్నారు.
తెలంగాణ మంత్రి కేటీఆర్ చంద్రబాబు అరెస్టు వ్యవహారం ఏపీకి సంబంధించిన వ్యవహారం అని, తమకు ఎటువంటి సంబంధం లేదని పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్టుపై ధర్నాలు చేయాల్సింది అక్కడ కానీ, తెలంగాణలో కాదంటూ ఆయన విమర్శించారు. ఇక ఇటీవల మంత్రి హరీష్ రావు స్పందించి చంద్రబాబు ని అరెస్ట్ చేయడం దురదృష్టకరమన్నారు. తాజాగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చంద్రబాబు అరెస్టుపై తనదైన స్పందనను తెలియజేశారు.












Click it and Unblock the Notifications