కేసీఆర్ కనిపించకపోతే నష్టమా... ఆగిపోయిందేంటి... భగ్గుమన్న మంత్రి తలసాని...
'వేర్ ఈజ్ కేసీఆర్..' అంటూ అటు ప్రతిపక్షాలు,ఇటు సోషల్ మీడియా గత కొద్దిరోజులుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. ప్రజలంతా కరోనా భయాందోళనలో ఉన్న వేళ... అందరికీ ముఖం చాటేసి ఫామ్ హౌస్లో ఎలా ఉంటారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తాజాగా ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ప్రతిపక్షాలు పనికిరాని దద్దమ్మలు అంటూ ధ్వజమెత్తిన ఆయన... సీఎం కనిపించకపోతే పాలన ఆగిందా..? అంటూ ప్రశ్నించారు.

కనిపించకపోతే పాలన ఆగిందా..?
'సీఎం కనిపించకపోతే పాలన ఆగిందా.. రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు ఆగాయా...?' అంటూ తలసాని ఫైర్ అయ్యారు. ఎక్కడినుంచైనా పరిపాలన చేసే సౌలభ్యం మనకు ఉందన్నారు. పాలనలో భాగంగా ప్రభుత్వం కొత్త సచివాలయం కడితే తప్పేంటని ప్రశ్నించారు. రాష్ట్ర గౌరవానికి తగ్గట్లు సచివాలయం ఉంటే తప్పా అని ప్రశ్నించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణపై బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ నేతలకు చేతనైతే... ప్రధానితో మాట్లాడి దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ పెట్టించాలని డిమాండ్ చేశారు.వ్యవసాయ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం(జూలై 8) ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆన్లైన్లో సమీక్షలు జరపట్లేదా అని ప్రశ్నించారు.

ప్రైవేట్ కంటే ప్రభుత్వ ఆస్పత్రులే నయం....
ప్రధాని మోదీ చప్పట్లు కొట్టమన్నప్పుడు, దీపాలు వెలిగించమన్నప్పుడు ఎందుకని తాము ప్రశ్నించామా అని మండిపడ్డారు.ప్రైవేట్ ఆస్పత్రులపై ప్రభుత్వానికి నియంత్రణ లేదని ఆరోపించడం సరికాదన్నారు.ఢిల్లీలో కరోనాను ఎందుకు కట్టడి చేయలేకపోయారో బీజేపీ నేతలు చెప్పాలన్నారు. ఎంఐఎంతో కలిస్తే కరోనా వస్తుందా... కేంద్రమంత్రి సమాధానం చెప్పాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ ఆస్పత్రుల కంటే ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే మంచి సదుపాయాలు ఉన్నాయన్నారు.

లాక్ డౌన్తో లాభం లేదు...
హైదరాబాద్లో లాక్ డౌన్పై ప్రచారం నేపథ్యంలో... నగరంలో లాక్ డౌన్తో ప్రయోజనం ఉండదని తలసాని స్పష్టం చేశారు. కరోనా వస్తుంది.. పోతుంది.. కాబట్టి ప్రజలే జాగ్రత్తలు తీసుకుంటే కోవిడ్ 19ని నియంత్రించవచ్చునని తెలిపారు. దీనికి మంత్రి మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, కాంగ్రెస్ నేత వి.హనుమంతురావే ఉదాహరణ అన్నారు. ఫిజికల్ ఫిట్నెస్ లేనివారే కరోనాతో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

వేర్ ఈజ్ కేసీఆర్..
రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడా కనిపించకపోవడంపై గత కొద్దిరోజులుగా విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. దివంగత ప్రధాని పీవీ నరసింహారావు జయంతి ఉత్సవాల తర్వాత ఆయన మళ్లీ కనిపించలేదు. ప్రగతి భవన్ సిబ్బందికి కరోనా సోకడంతో గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవెల్లిలో ఉన్న తన వ్యవసాయ క్షేత్రానికి ముఖ్యమంత్రి వెళ్లినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికైతే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ... అక్కడినుంచే ఆయన పాలన సాగిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ప్రతిపక్ష నేతలు మాత్రం కరోనా విషయంలో చేతులెత్తేసినందుకే కేసీఆర్ కనిపించకుండా దాక్కున్నారని విమర్శిస్తున్నారు.












Click it and Unblock the Notifications