కేంద్రానికి డెడ్ లైన్; ఉగాది తర్వాత తెలంగాణా ఉగ్రరూపం: మంత్రులు నిరంజన్ రెడ్డి, పువ్వాడ వార్నింగ్
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం పై పోరాటం చేస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వం యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేసే వరకు బిజెపి సర్కార్ ను వదిలిపెట్టేది లేదని తేల్చి చెబుతోంది. ఇటీవల ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలిసిన రాష్ట్ర మంత్రులు కేంద్రానికి డెడ్లైన్ పెట్టామని, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉగ్రరూపంలో ఉద్యమం చేస్తామని తేల్చి చెబుతున్నారు.

కేంద్రం వడ్లు కొనే వరకు పోరాటం చేస్తాం: మంత్రి నిరంజన్ రెడ్డి
రాష్ట్రంలో రైతాంగం సాగుచేసిన ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒడ్లు కొనే వరకు పోరాటం కొనసాగుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత మంత్రి నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి నిరంజన్ రెడ్డి వడ్లు కొనాలని ఎన్నిసార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
తెలంగాణాను అవమానించిన వారు కాలగర్భంలో కలిసిపోయారు: నిరంజన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్రానికి చిన్నచూపు చూస్తోందని మంత్రి ప్రకటించారు. తెలంగాణను అవమానించిన వారు కాలగర్భంలో కలిసిపోయారు అని పేర్కొన్న మంత్రి నిరంజన్ రెడ్డి కేంద్రం ఇంత ఘోరంగా అవమానిస్తున్నా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడటంలేదో చెప్పాలని ప్రశ్నించారు. కేంద్రంతో వడ్లు కొనిపిస్తామని చెప్పిన బిజెపి నాయకులు ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. బిజెపి నాయకులు కావాలని తెలంగాణ మీద, కేసీఆర్ మీద విషం కక్కుతున్నారని మంత్రి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
పాలన చేతకాకపోతే దిగిపోవాలి, ఉగాది తర్వాత ఉద్యమం ఉధృతం : నిరంజన్ రెడ్డి
బాయిల్డ్ రైస్ కొనమని, రా రైస్ మాత్రమే కొంటామని కేంద్రం చెబుతోందని పేర్కొన్న నిరంజన్ రెడ్డి, బాయిల్ చెయ్యకుండా రా రైస్ చేస్తే నూకలు అవుతాయని చెప్పామని,తెలంగాణ ప్రజలకు నూకలు అలవాటు చేయాలని కేంద్రం అవమానిస్తోందని వెల్లడించారు. కావాలని తెలంగాణా రైతాంగాన్ని ఇబ్బంది పెట్టేలా కేంద్ర వ్యవహార శైలి ఉందని పేర్కొన్నారు. కేంద్రానికి ముందు చూపు లేదని పాలన చేతకాకపోతే దిగిపోవాలని సూచించారు మంత్రి నిరంజన్ రెడ్డి. కేంద్ర స్పందించకుంటే ఉగాది తర్వాత ఉద్యమ ఉధృతరూపం దాలుస్తుందని, అందుకు రైతులు కూడా సిద్ధం కావాలని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.

ఏప్రిల్ 2వ తేదీ వరకు డెడ్ లైన్ .. ఉగాది తర్వాత ఉగ్రరూపమే: మంత్రి పువ్వాడ
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ ఉగాది తర్వాత ఉగ్ర తెలంగాణను చూస్తారని పేర్కొన్నారు. ఏప్రిల్ 2వ తేదీ వరకు కేంద్ర స్పందన కోసం ఎదురు చూస్తామని, ఆ తర్వాత తెలంగాణ ఉగ్రరూపాన్ని చూపిస్తామని ఆయన తెలిపారు రైతుల తో పెట్టుకుంటే పొట్టు అవుతారని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం ఆగ్రహంతో ఊగిపోతున్నారని, వారి ఉడుకు ఏంటో ఉగాది తర్వాత చూస్తారు అంటూ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications