మిస్టరీగా ఎన్నో హత్యలు, నయీంతో సంబంధాలు: శ్రీధర్ బాబుపై పుట్ట సంచలనం
హైదరాబాద్: మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శ్రీధర్ బాబు పైన మంథని ఎమ్మెల్యే, తెరాస నేత పుట్ట మధు సోమవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఎన్కౌంటర్లో మృతి చెందిన గ్యాంగ్ స్టర్ నయీంతో శ్రీధర్ బాబుకు సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు.
నయీంతో కలిసి ఆయన పలు సెటిల్మెంట్లు చేశారన్నారు. శ్రీధర్ బాబు హయాంలో జరిగిన పలు హత్యలు ఇప్పటికీ మిస్టరీగా ఉన్నాయని చెప్పారు. శ్రీధర్ బాబు-నయీం సంబంధాల పైన విచారణ జరిపించాలని తాను ముఖ్యమంత్రి కేసీఆర్, డిజిపికి లేఖ రాస్తానని చెప్పారు.
పేదల సంక్షేమం గాలికి: రావుల
పేదల సంక్షేమాన్ని ప్రభుత్వం గాలికి వదిలేసిందని తెలంగాణ టిడిపి పొలిట్బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి హైదరాబాదులో విమర్శించారు. పింఛన్లు, రెండు పడకగదుల ఇళ్లు, అర్హులందరికీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ టిడిపి హైదరాబాద్ నగర శాఖ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించింది.
నగరంలో రహదారులు దారుణంగా దెబ్బతిన్నాయని, బయటివారు నగరానికి రావాలంటే భయపడుతున్నారన్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువుల పింఛన్లలో కోత విధించడం సరికాదన్నారు.
రేషన్కార్డులు అర్హులందరికీ అందించాలని డిమాండ్ చేశారు. కొత్త సచివాలయం పేరిట రూ.కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, ఇది సరికాదన్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రమైతేసంక్షేమ పథకాలలో కోతలు ఎందుకు విధిస్తున్నారో చెప్పాలన్నారు.