వారిపై నమ్మకం లేదా: కెసిఆర్కు షబ్బీర్ ప్రశ్న
హైదరాబాద్: అవసరమైతే అసెంబ్లీని రద్దు చేస్తామన్న తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ తీవ్రంగా ప్రతిస్పందించారు. మీ ఎమ్మెల్యేలపై అప్పుడే నమ్మకం కోల్పోయారా? అని ఆయన ప్రశ్నించారు.
అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తామన్న కేసీఆర్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నమని షబ్బీర్ అలీ చెప్పారు. తెలంగాణ ద్రోహులను కేబినెట్లో చేర్చుకోవడం కేసీఆర్ ముందస్తు ప్రణాళికలో భాగమేనని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సొంత డబ్బా కొట్టుకోవడం అలవాటని, ఆయన జాతీయ నేత కాలేడని వెన్నుపోటుదారుడనే గుర్తింపు ఉందని షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. చంద్రబాబు పుట్టకముందే హైదరాబాద్కు గుర్తింపు ఉందని, తెలంగాణలో టీడీపీ నామ రూపాల్లేకుండా పోతుందన్నారు. ఏపీలో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన టీడీపీని అక్కడి ప్రజలు గోదావరిలో కలిపేయడం ఖాయమని షబ్బీర్ అలీ జోస్యం చెప్పారు.
టీఆర్ఎస్కు బలం లేకపోయినా ఐదో అభ్యర్థిని నిలబెట్టారని, 63 మంది ఎమ్మెల్యేలతో ఐదు ఎమ్మెల్సీ స్థానాలుప ఎలా గెలుస్తారని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ఎమ్మెల్యేలను సంతల్లో పశువుల్లా కొంటున్నారని ధ్వజమెత్తారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు దమ్ముంటే తుగ్లక్ పాలనకు వ్యతిరేకంగా ఓటేయాలని సవాల్ విసిరారు. అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్తే అందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.