టీఆర్ఎస్కు మును‘గోడు’: కూసుకుంట్లను వ్యతిరేకిస్తూ రచ్చ, ఓటమి ఖాయమంటూ వార్నింగ్
హైదరాబాద్: మునుగోడు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఆ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. దీంతో ఆ స్థానం దక్కించుకునేందుకు బీజేపీతోపాటు కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు కూడా గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. అయితే, బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఖరారు కాగా, కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల విషయంలో తర్జనా భర్జనలు చోటు చేసుకుంటున్నాయి.

కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని వ్యతిరేకిస్తున్న అసమ్మతి నేతలు
కాగా, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టీఆర్ఎస్ అధిష్టానం టికెట్ ఖరారు చేసిందని ప్రచారం జరుగుతుండటంతో ఒక్కసారిగా అసమ్మతి వర్గం భగ్గుమంది. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టీఆర్ఎస్ టిక్కెట్ ఇవ్వొద్దంటూ.. మునుగోడు నియోజకవర్గం అసమ్మతి నేతలు మరోసారి సమావేశమయ్యారు. చౌటుప్పల్లో జరిగిన ఈ భేటీలో సుమారు 80 మంది ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ మునుగోడులో గెలవాలంటే... కూసుకుంట్లకు టికెట్ ఇవ్వొద్దని మూకమ్మడి తీర్మానం చేశారు.

కూసుకుంట్లకు టికెట్ ఇస్తే ఓటమి ఖాయమంటున్న నేతలు
అంతేగాక, కూసుకుంట్లకు టికెట్ ఇస్తే ఓడిస్తామని అసమ్మతి నేతలు స్పష్టం చేశారు. ఉప ఎన్నికల్లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ కేటాయిస్తే టీఆర్ఎస్ గెలిచే అవకాశం లేదని, కార్యకర్తల్లో తీవ్రమైన వ్యతిరేక వున్నదని అసమ్మతి నేతలు చెబుతున్నారు. ఇదే విషయాన్ని వారం క్రితం కూడా జిల్లా ఇంఛార్జ్ మంత్రి జగదీశ్వర్రెడ్డికి చెప్పినట్లు తెలిపారు. అయినా కూడా ఆయనకే టికెట్ ఇస్తే పార్టీ ఓడిపోవడం ఖాయమని తేల్చి చెబుతున్నారు.

అసమ్మతి నేతలను చల్లబరిచేందుకు రంగంలోకి మంత్రి
అయితే, అసమ్మతి నేతనలు చల్లబరిచేందుకు జగదీశ్వర్రెడ్డి ఇప్పటికే ఓసారి వారితో సమావేశమయ్యారు. అయినా కూడా స్థానిక నేతలు కూసుకుంట్లకు మద్దతు తెలపడం లేదు. ఈ అసంతృప్తి వ్యవహారం ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ అధినేత వద్దకు కూడా చేరినట్లు తెలుస్తోంది.
Recommended Video


మునుగోడులో కేసీఆర్ భారీ సభ: అసమ్మతి చల్లబడేనా?
ఇక, మునుగోడు ఉపఎన్నికలను అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆగస్టు 20న టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్తో భారీ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే మంత్రి జగదీశ్రెడ్డి.. మునుగోడు, చండూరు, సంస్థాన్ నారాయణపురంలో స్థలపరిశీలన చేశారు. మునుగోడు ప్రజాదీవెన పేరుతో లక్ష మందితో సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆగస్టు 20న మధ్యాహ్నం 2 గంటలకు జరగనున్న ఈ సభను విజయవంతం చేసేందుకు మండలాల వారీగా ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు బాధ్యతలు అప్పగించారు. అప్పటిలోగా ఈ అసమ్మతి వ్యవహారాన్ని కూడా చల్లబరచాలని మంత్రి కసరత్తులు చేస్తున్నారు. మరోవైపు, మునుగోడు తమదేనంటోంది బీజేపీ. ఇక కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ సీటును దక్కించుకునేందుకు ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టింది.












Click it and Unblock the Notifications