పరువు హత్య?: యువకుడి ప్రాణం తీసిన ప్రేమ వివాహం
నల్గొండ: జిల్లాలోని మిర్యాలగూడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆరు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ప్రణయ్ అనే యువకుడ్ని మిర్యాలగూడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి ఎదుట ఓ దుండగుడు కత్తితో నరికి చంపాడు.
కులాలు వేరైనా ప్రణయ్కుమార్, అమృత ప్రేమించుకున్నారు. ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకున్నారు. సంతోషంగా తమ కాపురాన్ని సాగిస్తున్నారు. భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లి వస్తుండగా ఊహించని రీతిలో ఓ దుండగుడు మృత్యువులా విరుచుకుపడ్డాడు. యువకుడిని కత్తితో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఆస్పత్రి గేటు వద్ద మాటు వేసిన దుండగుడు ప్రణయ్ మెడపై రెండు సార్లు విచక్షణారహితంగా నరికాడు. ఒక్క వేటుకే బాధితుడు విలవిల్లాడుతూ నేలకొరిగాడు. ఈ ఘటనలో బాధితుడు అక్కడికక్కడే ప్రాణాలొదలగా.. అతని భార్య జరిగిన దారుణం చూసి భయంతో ఆస్పత్రి వైపు పరుగులు పెట్టింది.
వైద్య సిబ్బంది అక్కడి చేరుకునే లోపే ప్రణయ్ ప్రాణాలు వదిలాడు. కాగా, వీరి ప్రేమ వివాహం ఇష్టంలేని అమ్మాయి తరఫు బంధువులే అతనిపై దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
కాగా, ప్రస్తుతం ప్రణబ్ భార్య అమృత ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఆమెకు ప్రణయ్ చనిపోయినట్లు తెలియదు. ప్రణయ్ హత్య కేసులో అమృత తండ్రి హస్తమున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కిరాయి హంతకులతో హత్య చేయించినట్లు భావిస్తున్నారు. ప్రణయ్ది పరువు హత్యగానే భావిస్తున్నట్లు ఎస్పీ రంగనాథ్ తెలిపారు.
కిరాయి హంతకులకు రూ.10లక్షలు ఇచ్చిన అమృత తండ్రి
ప్రణయ్ హత్యకు అమృత తండ్రి మారుతీరావు కిరాయి హంతకులకు రూ.10లక్షలు మూడు నెలల క్రితమే ఇచ్చినట్లు సమాచారం. ప్రణయ్ హత్య కేసులో అమృత తండ్రి మారుతీరావు ఏ1 నిందితుడిగా ఉండగా, అమృత బాబాయ్ శ్రవణ్ ఏ2గా ఉన్నారు. ప్రస్తుతం వీరిద్దరూ పరారీలో ఉన్నారు. వీరి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టినట్లు ఎస్పీ రంగనాథ్ తెలిపారు.
{document1}