టీటీడీపీకి మరమ్మత్తులు: నారా లోకేశ్ జోష్, నాయకులకు వార్నింగ్?
హైదరాబాద్: తెలంగాణ టీడీపీ శాఖపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దృష్టి సారించారా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ క్రమంలో ఇటీవల జరిగిన తెలంగాణ టీడీపీ సమీక్షా సమావేశంలో లోకేశ్ కొన్ని అంశాలను గుర్తించినట్లు తెలుస్తోంది.
టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్తో డీలా పడిపోయిన టీడీపీ కార్యకర్తలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో పార్టీ అధినేత చంద్రబాబు సైతం తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసే దిశగా దృష్టి సారించారు. చాలా రోజుల తర్వాత తెలంగాణ టీడీపీపై నిర్వహించిన సమీక్ష సమావేశాన్ని హైదరాబాద్లోనే నిర్వహించడం విశేషం.
గత ఏడాది కాలంగా తెలంగాణ టీడీపీ సమీక్షలు విజయవాడలోనే నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇటీవలే హైదరాబాద్లోని లేక్ వ్యూ అతిథిగృహంలో రెండు గంటల పాటు పార్టీ పరిస్థితిపై చంద్రబాబు రివ్యూ నిర్వహించారు. ఈ రివ్యూతో పార్టీ నేతలతో పాటు, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కనిపించింది.

ఇకపై ప్రతి శనివారం తెలంగాణ టీడీపీ పరిస్థితిపై సమీక్షించాల్సిందిగా నారా లోకేశ్ను చంద్రబాబు ఆదేశించినట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు ఆదేశాల మేరకే తొలి సమీక్షను ఇటీవలే ఎన్టీఆర్ భవన్లో నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రధానంగా పార్టీ సంస్థాగత విషయాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది.
తెలంగాణలో పార్టీ అనుబంధ విభాగాలు.. వాటి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల ఎంపిక.. నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్ల నియామకం.. ప్రతి జిల్లాకు రాష్ర్ట పార్టీ ఇన్ఛార్జ్ల నియామకం వంటి అంశాలపై చర్చించారని సమాచారం. అయితే చర్చ ఆరంభంలోనే కొందరు సీనియర్లు పెదవి విరుపులు విరిచారు.
దీంతో లోకేశ్ ఒకింత అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. పార్టీలో ఏ పదవిలో ఎవరిని నియమించాలన్న దానిపై చర్చ ప్రారంభం కాకముందే అభ్యంతరాలు వ్యక్తం చేయడం మంచి పద్ధతి కాదని సీనియర్లతో ఒకింత కటువుగానే చెప్పినట్లు సమాచారం.
''మీరు ఇలా రిజర్వేషన్లు పెట్టుకుంటే పార్టీ ముందుకు ఎలా వెళుతుంది. ఫలానా పదవికి ఫలానా వ్యక్తిని నియమిస్తే బాగుంటుందని ప్రతిపాదనలు వస్తాయి. వాటిపై ఇక్కడ సమావేశంలో మనం చర్చించి నిర్ణయం తీసుకుంటాం. అసలు చర్చే వద్దు... అనుబంధ విభాగాలు ఏర్పాటు చేయాల్సిన అవసరమే లేదన్నట్టు వ్యవహరిస్తే ఎలా? అని అన్నారంట.
"మీకు పర్సనల్ ఇష్యూలు ఏమైనా ఉంటే నాతో వ్యక్తిగతంగా కలిసి చెప్పండి. అంతే కానీ, పెదవి విరుపులు చేయడం సరికాదు'' ఒకింత అసహనాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ సమావేశం తర్వాత తెలంగాణలోని టీడీపీ నేతలు ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప... కలిసికట్టుగా పని చేయాలన్న భావన లేదని లోకేశ్కు కలిగిందట.
దీంతో మొహమాటానికి పోతే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని, ఇకపై పార్టీ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలు తప్ప నేతల ఇగోలను సంతృప్తి పరిచే అంశాలను ఎట్టి పరిస్థితుల్లో ఎజెండాలోకి తీసుకుని రాకుడదని లోకేష్ నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.












Click it and Unblock the Notifications