ఆంధ్రా వర్సెస్ తెలంగాణ: 'హైకోర్టులో వారు ఆంధ్రా జడ్జిలు కారు'
హైదరాబాద్: ఫిరాయింపుల ఎమ్మెల్యేల కేసులో హైకోర్టుకు సమాధానం చెప్పేందుకు కెసిఆర్ ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, వివేక్లు శుక్రవారం ప్రశ్నించారు.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సభాపతి ముందే మంత్రిగా విధులు నిర్వహిస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. న్యాయ వ్యవస్థకు కుల, మత, ప్రాంతాలు ఆపాదించవద్దని వారు టిఆర్ఎస్ నేతలకు, ప్రభుత్వానికి హితవు పలికారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో జడ్జిలు ఆంధ్రులు కారని గుర్తించాలన్నారు.
ముఖ్యమంత్రిపై నారాయణ
నిజాంను పొగుడుతూ కెసిఆర్ నిరంకుశ పాలన సాగిస్తున్నారని సిపిఐ నేత నారాయణ వేరుగా మండిపడ్డారు. కార్మిక చట్టాలను కాలరాస్తోన్న కెసిఆర్ పైన కేసులు పెట్టాలన్నారు. సమస్యలు పరిష్కరించకుండా ఉద్యమాన్ని అణిచి వేయాలని చూస్తున్నారన్నారు. కార్మికులను విభజించి పాలించడం మానుకోవాలన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన వేతనాలను అందరికీ అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్నారు. లేదంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన తెలుపుతామని హెచ్చరించారు.