పంచాయతీ ఎన్నికల్లో సామాన్యులకు నో ఛాన్స్..! ఏకగ్రీవం కోసం రంగంలోకి దిగిన బడా బాబులు..!!
హైదరాబాద్ : మొదలైంది. రణం మొదలైంది. అపజయానికి, ఆదిపత్యానికి మద్య సంకుల సమరం మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పై చేయి సాధించేందుకు యుద్ద శంఖారవం పూరించబడింది. యుక్తులు, కుయుక్తులకు శ్రీకారం చుడుతున్న నేతలు విజయం తమకే దక్కాలని ఇప్పటినుండే ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. పరువు-ప్రతిష్టతకు మారుపేరుగా జరిగే పంచాయతీ ఎన్నికలు స్థానికి నేతలకు ప్రతిష్టాత్మకంగా మారుతుంది. ఈ నేపథ్యంలో అభ్యర్ధుల గెలుపుకోసం అవిశ్రాంతంగా క్రుషి చేస్తుంటారు స్థానిక నాయకులు. ఇప్పుడు తెలంగాణలో కూడా అవే పరిస్థితులు నెలకొన్నాయి. తమ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ఎంత వరకైనా పోరాడేందుకు సంసిద్దత వ్యక్తం చేస్తున్నారు బడా నేతలు.
ప్రతిస్టాత్మకం ఐన పంచాయతీలు..! ఇజ్జత్ కీ సవాల్ అంటున్న స్థానిక నాయకులు..!!
అసలు చాలా వరకు ఎన్నికలే లేకుండా అభ్యర్థుల ఏకగ్రీవానికి పావులు కదుపుతున్నారు స్థానిక నాయకులు. అందుకోసం బూత్ స్థాయి నుండి మండల స్థాయి వరకు పార్టీ కార్యక్తరల నుండి సానుభూతి పరుల వరకూ అనేక తాయిలాలు గుప్పించేందుకు రెడీ ఐపోతున్నారు. ఇక దావత్ లకు, పైపై ఖర్చలతో పాటు, అభ్యర్థుల బేరసారాలకు సైతం వెనకాడడంలేదు నాయకులు. దీంతో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నకిల్లో నిలబడి ప్రజాబలంతో గెలవాలనుకునే నాయకులకు ఇబ్బందికర పరిస్తితులు తలెత్తాయి. తెలంగాణ మొత్తం జిల్లాల వ్యాప్తంగా ఇదే వాతావరణం నెలకొనడంతో సామాన్యులు ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాని వాతావరణం నెలకొంది. పంచాయతీ ఎన్నికల తీరు, నేతలు అనుసరిస్తున్న విధానాలపై వన్ ఇండియా ప్రత్యేక కథనం..!!
ఏకగ్రీవాలపైనే వారి గురి..! రంగంలోకి దిగిన బడా నేతలు..!!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పల్లెపోరుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెరలేపడంతో గల్లీ లీడర్లలో గడబిడ మొదలైంది. గ్రామాల్లో సర్పంచ్ పదవికి ఎనలేని గౌరవం ఉండడంతో దాని కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్న లీడర్లు రంగంలోకి దిగారు. రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆయా క్యాటగిరీలకు చెందిన గ్రామాల నాయకులు ఎవరికి వారే సర్పంచ్, వార్డు సభ్యుల పదవులను కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పంట చేలల్లో, తోటల్లో దావత్లు ఏర్పాటు చేసి ప్రత్యర్థులుగా బరిలోకి దిగే అవకాశం ఉన్న వారితో బేరసారాలు మొదలుపెట్టారు.
మొదలైన బేరాలు..! పంచాయతీలకు లక్షల్లో ఎర..!!
పంచాయతీ సర్పంచ్ పదవులను ఏకగ్రీవం చేసేందుకు ఆయా గ్రామాల పెద్దలు, సంబంధిత మండలాల, నియోజక వర్గాల లీడర్లు రంగంలోకి దిగారు. చిన్న పంచాయతీలలో ఈ తరహా బేరసారాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. వార్డులు తక్కువ, లీడర్ల సంఖ్య కూడా తక్కువే ఉండడంతో బేరసారాలతో ఒప్పించి వాటిని కైవసం చేసుకోవడం సులభమని భావించిన బడా లీడర్లు ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రధాన పార్టీల నేతలు తమకు అనుయాయులైన వారి కార్యకర్తలను రంగంలోకి దించారు. 500లోపు జనాభా ఉన్న పంచాయతీలే రాష్ట్రంలో 981 ఉన్నాయి. ఇలాంటి పంచాయతీలన్నింటినీ ఏకగ్రీవం చేయడం పెద్ద కష్టం కాదనే భావన ఆయా నియోజకవర్గాల ప్రధానపార్టీల నేతల్లో ఉంది. అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన అధికారపార్టీ నేతలు పంచాయతీలను వారి పార్టీ ఖాతాలో వేసుకునే ప్రక్రియను ముమ్మరం చేశారు.
సిబ్బంది లేక ఇబ్బంది పడుతున్న పోలీసులు..! సమస్యాత్మక ప్రాంతాల్లో ఏంటి పరిస్థితి..!
రెండు నెలల పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలల్లో బిజీబిజీ గా విధులు నిర్వహించి ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటు న్న పోలీసులకు రాష్ట్ర పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్డ్ వెలువడడంతో గుదిబండగా మారింది. 30 జిల్లాలలో 12732 గ్రామ పంచాయతీలకు ఈ నెల 20, 25, 30 తేదీల్లో మూడు దశల్లో ఎన్నిక లు జరుగుతాయి. ఈ నెల 7 నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలు 30వ తేదీ వరకు ఎన్నికల ప్రక్రియ సాగనుంది. దీంతో పోలీసులు బందోబస్తుకు తిరిగి సిద్ధమవుతున్నారు. బందోబస్తుకు సరిపోను సిబ్బంది లేకపోవడంతో సమస్యలు ఉత్పన్నమవుతాయని అధికారులు ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది.