అమెరికాలో భార్యకు వేధింపులు, రెండో పెళ్లి: ఎన్నారై అరెస్టు
అమెరికాలో భార్యను వేధించిన కేసులో మూడేళ్లుగా తప్పించుకుని తిరుగుతూ రెండో పెళ్లి కూడా చేసుకున్న ఎన్నారైని పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్: అమెరికాలో భార్యను వేధించిన కేసులో గత మూడేళ్లుగా పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్న ఎన్నారై ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. హైదరాబాదులోని కూకట్పల్లిలో గల ప్రగతి నగర్కు చెందిన లింగారెడ్డిని హయత్నగర్ పోలీసులు శనివారంనాడు అరెస్టు చేశారు.
అమెరికాలో భార్యను వేధించడమే కాకుండా ఇక్కడికి తిరిగి వచ్చిన మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అతనిపై హత్యాయత్నం, చీటింగ్ కింద కేసు నమోదైంది. లింగారెడ్డికి హైదరాబాదుకు చెందిన స్వప్నారెడ్డితో నాలుగేళ్ల కిందట వివాహం జరిగింది. వివాహం జరిగిన కొద్ది రోజులకే ఆమెను లింగారెడ్డి అమెరికా తీసుకుని వెళ్లాడు. అక్కడ ఆమెను తీవ్రంగా వేధిస్తూ వచ్చాడు.
పెళ్లి సందర్భంగా ఇచ్చింది సరిపోదని, మరింత కట్నం కావాలని హింసిస్తూ వచ్చాడని ఆరోపణలు వచ్చాయి. వేధింపులు భరించలేక స్వప్నారెడ్డి అమెరికాలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసుల భయంతో అతను అమెరికా నుంచి పారిపోయి వచ్చాడు.
చాలా రోజుల పాటు ఎవరికీ కనిపించకుండా తిరిగాడు. తర్వాత దివ్య అనే మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు వాళ్లిద్దరు కూకట్పల్లిలో ఉంటున్నారు. హైదరాబాదులోనే ఉంటున్న స్వప్నారెడ్డి కుటుంబ సభ్యులకు అతని ఆచూకీ తెలిసింది. దీంతో వారు జనవరి 5వ తేదీన హయత్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు లింగారెడ్డిని శనివారంనాడు అరెస్టు చేశారు. బాధితురాలు స్వప్న ప్రస్తుతం అమెరికాలోనే ఉంటున్నారు. లింగారెడ్డి మొదటి భార్య విషయం దివ్యకు తెలుసా, లేదా అనేది తేలాల్సి ఉంది.