డీకే అరుణ వ్యాఖ్య కలకలం: సీట్లో కూర్చోమని కేసీఆర్
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డీకే అరుణ వ్యాఖ్యల పైన తెరాస నేతలు మీడియా పాయింట్ వద్ద మండిపడగా, సభలో గందరగోళం చెలరేగింది. సభలో తెరాస ఎమ్మెల్యేను ఉద్దేశించి నోరు మూసుకోమని డీకే అరుణ వ్యాఖ్యానించారు. దీనిపై గందరగోళం చెలరేగటంతో స్పీకర్ సభను పదిహేను నిమిషాల పాటు వాయిదా వేశారు.
ఈ సందర్భంగా తెరాస నేతలు మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. రాజ్యాంగం తెలిసిన మహిళా ఎమ్మెల్యే వీధి రౌడీలా మాట్లాడటం విడ్డూరమని గొంగిడి సునీత అన్నారు. ఇలాంటి వ్యక్తులు సభలో అడుగు పెట్టినందుకు బాధపడుతున్నామన్నారు. ఇలాంటి మహిళా ఉన్న సభలో తాను ఉన్నందుకు సిగ్గుపడుతున్నానని సునీత అన్నారు. డీకే అరుణ ప్రవర్తన మహిళలు సిగ్గుపడేలా ఉందన్నారు.
సభ ప్రారంభమయ్యాక కూడా రాద్దాంతం

సభ ప్రారంభం కాగానే డీకే అరుణ వ్యాఖ్యల పైన గందరగోళం చెలరేగింది. మంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతుండగా.. కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. పోడియం వద్దకు దూసుకెళ్లారు. వెల్ లోకి వెళ్లి నినాదాలు చేశారు.
కడియం మాట్లాడుతూ.. మేం చెప్పేది వింటే మీది తప్పవుతుందని భావించే అలా ఆందోళన చేస్తున్నారన్నారు. డీకే అరుణ వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు. జాతీయ గీతాలాపన సమయంలో జానా రెడ్డి లేరని, జీవన్ రెడ్డి ఉన్నారని చెప్పారు. అప్పుడేం జరిగిందో ఆయననే అడుగుతున్నామని చెప్పారు. అరుణ వ్యాఖ్యలు మహిళల్ని కించపరిచేలా ఉన్నాయన్నారు.
కాంగ్రెస్ సభ్యులు వెల్ లోకి వెళ్లి నిరసన తెలుపుతుండటంతో.. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాట్లాడుతూ.. అందరూ ఎవరి సీట్లలో వారు కూర్చోవాలని విజ్ఞప్తి చేశారు. అయితే, కాంగ్రెస్ సభ్యురాలు క్షమాపణ చెప్పాలని తెరాస, తెరాస క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
కాంగ్రెస్ సభ్యులు మాట్లాడుతూ.. డీకే అరుణ పట్ల కాంగ్రెస్ సభ్యులు దురుసుగా ప్రవర్తించాలని మండిపడ్డారు. ఆమెకు అధికార పార్టీ క్షమాపణ చెప్పాల్సిందే అన్నారు. అధికార పార్టీ సభ్యులు అన్ పార్లమెంటరీ పదాలు వాడుతున్నారన్నారు. అధికార పార్టీ సభ్యుడు అభ్యంతరకర పదం ఉపయోగించారన్నారు. మాజీ మంత్రి జానా రెడ్డి మాట్లాడుతూ.. మంత్రులు అహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తమ పార్టీ సభ్యురాలు కూడా కొంత ఆవేశంతో మాట్లాడినట్లుగా కనిపిస్తోందన్నారు.












Click it and Unblock the Notifications