లైవ్ ఇంటర్వ్యూలోనే అరెస్ట్, టీవీ9 స్టూడియోలో పోలీసుల ఎంట్రీ
హైదరాబాద్ : ఆమధ్య.. పరిటాల రవి హత్య తర్వాత.. అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన నిందితుడు మొద్దుశీను అకస్మాత్తుగా టీవీ ఇంటర్వ్యూలో ప్రత్యక్షమైన విషయం తెలిసిందే. ఆ ఇంటర్వ్యూలో తాను హత్య ఎందుకు చేసింది ఎలా చేసింది అన్నదానిపై పూసగుచ్చినట్లు వివరణ ఇచ్చాడు. ఇప్పుడదే తరహాలో మరో నిందితుడు కూడా.. హత్యానంతరం టీవీ ఇంటర్వ్యూలో ప్రత్యక్షమవడం చర్చనీయాంశంగా మారింది.
బోయిన్ పల్లిలో కాంగ్రెస్ నేత యాదగిరిపై కాల్పులకు తెగించిన నిందితుడు మహేష్ అలియాస్ డాకూరు బాబు.. టీవీ9 కు ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. పోలీసులకు లొంగిపోయేందుకే తాను స్టూడియోకు వచ్చానంటూ చెప్పాడు బాబు. ఇంటర్వ్యూలో హత్యకు సంబంధించి మీడియా ప్రతినిధులు పలు ప్రశ్నలు అడగ్గా డాకూరు బాబు సమాధానం ఇస్తూ వచ్చాడు. యాదగిరిపై కాల్పులు జరిపిన విషయాన్ని కూడా అంగీకరించాడు బాబు.

గతంలోను శివరాజ్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని హత్య చేసిన బాబు.. ఆ హత్య తర్వాత చాలా మథనపడ్డానని, అప్పటినుంచి మళ్లీ దందాల జోలికి వెళ్లలేదంటూ చెప్పుకొచ్చాడు. అయితే యాదగిరి తనను కొంతకాలంగా వెంబడిస్తుండడంతో తన నుంచి ప్రాణ హాని ఏర్పడిందన్నాడు బాబు. హత్యలు చేసేందుకు తుపాకీ కొనలేదని, కేవలం యాదగిరిని బెదిరించేందుకే తుపాకీ తీసుకెళ్లానని చెప్పాడు.
నిజానికి యాదగిరిపై కాల్పులకు ముందురోజు తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని బాబు తెలిపాడు.
అయితే చివరకు తాడో పేడో తేల్చుకోవాలనే ఉద్దేశంతోనే యాదగిరి వద్దకు వెళ్లానని, యాదగిరిని చంపే ఉద్దేశంతో తాను అక్కడికి వెళ్లలేదని వివరించాడు. ఇలా ఓవైపు ఇంటర్వ్యూ కొనసాగుతుండగానే.. స్టూడియోలోకి ఎంట్రీ ఇచ్చిన పోలీసులు డాకూరి బాబును అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications