పూనమ్ కౌర్ చేయి పట్టుకున్న రాహుల్-బీజేపీ విమర్శలు-మీ విచక్షణకే వదిలేశానన్న నటి
తెలంగాణలో సాగుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో నటి, సామాజిక కార్యకర్త పూనమ్ కౌర్ ఆయన్ను కలిశారు. రాహుల్ తో కలిసి కాసేపు యాత్రలో నడిచారు. ఈ సమయంలో చోటుచేసుకున్న ఓ ఘటన బీజేపీకి వరంగా మారింది. దీంతో కాషాయ పార్టీ విమర్శలకు దిగింది. దీనిపై స్పందించిన పూనమ్ కౌర్.. దీన్ని వారి విచక్షణకే వదిలేస్తున్నట్లు తెలిపింది.
రాహుల్ చేయి పట్టుకుని నడిచిన పూనమ్
కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్రలో కొత్తగా కనిపిస్తున్నారు. గతంతో పోలిస్తే జనంతో బాగా కలిసి పోతున్నారు. గతంలో తాను కోల్పోయిన అభిమానాన్ని భారత్ జోడోయాత్ర ద్వారా జనం నుంచి పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో జనానికి హామీలు కూడా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో భారత్ జోడో యాత్రలో నడుస్తున్న రాహుల్ గాంధీని నటి, సామాజిక కార్యకర్త పూనమ్ కౌర్ కలిశారు. కాసేపు ఆయనతో పాటు చేతిలో చేయి పెట్టి మరీ నడిచారు. దీంతో రాహుల్ ప్రత్యర్ధులు విమర్శలకు దిగారు.
పూనమ్ కౌర్ పై బీజేపీ ట్వీట్ వార్
రాహుల్ గాంధీతో చేయి పట్టుకుని నడిచిన పూనమ్ కౌర్ ను సోషల్ మీడియాలో బీజేపీ నేతలు, కార్యకర్తలు టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఆయన చేయి పట్టుకుని నడవాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ విమర్శలకు దిగారు. కొందరైతే రాహుల్ ఆమెను చేయి పట్టి లాగేయడాన్ని తప్పుబట్టారు. రాహుల్ పాదయాత్ర సాగుతున్న సమయంలో భద్రతా సిబ్బంది ఆమెను వారించారు. ఈ విషయం గ్రహించిన రాహుల్ ఆమెను చేయి పట్టుకుని పక్క నుంచి నడవమంటూ లాగారు. దీంతో ఈ వ్యవహారాన్ని కూడా బీజేపీ విమర్శలకు వాడుకుంటోంది. మహిళలతో రాహుల్ ప్రవర్తన ఇదేనా అంటూ టార్గెట్ చేస్తోంది.
మీ విచక్షణకే వదిలేస్తున్నానన్న పూనమ్
చేనేత వస్త్రాలపై జీరో జీఎస్టీకి రాహుల్ గాంధీ ఇచ్చిన హామీకి కృతజ్ఞతలు అంటూ పూనమ్ ట్వీట్ చేశారు. అలాగే
రాహుల్ గాంధీ చేయి పట్టుకుని తాను నడవడం, రాహుల్ గాంధీ తన చేయి పట్టుకుని పక్కకు లాగడం వంటి అంశాలపై బీజేపీ నేతలు సోషల్ మీడియాలో చేస్తున్న విమర్శలను పూనమ్ కౌర్ తిప్పికొట్టారు. మహిళల విషయంలో రాహుల్ స్పందన, ఆయనిచ్చే గౌరవం, వారిని సంరక్షించే వైఖరి తనను హార్ట్ టచ్ చేశాయంటూ ట్వీట్ చేశారు. అలాగే బీజేపీ నేతలు దీనిపై చేస్తున్న విమర్శలపై స్పందిస్తూ వారి విచక్షణకే వదిలిపెడుతున్నానంటూ పూనమ్ రియాక్ట్ అయ్యారు. దీంతో బీజేపీ నేతలు ఆత్మరక్షణలో పడ్డారు.
మోడీ ఫోటోలతో కాంగ్రెస్ కౌంటర్
అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోడీ మహిళల చేతులు పట్టుకున్న ఫొటోల్ని ట్వీట్ చేశారు. ప్రధాని మోడీ గతంలో మహిళల చేతులు పట్టుకోలేదా ఇప్పుడు రాహుల్ పట్టుకుంటే తప్పయిందా అనే అర్ధం వచ్చేలా కాంగ్రెస్ నేతలు ట్వీట్లు చేస్తున్నారు. పూనమ్ తో పాటు ప్రజలందరినీ దగ్గరకు తీసుకుంటూ రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారని, ఇది జీర్ణించుకోలేక బీజేపీ విమర్శలకు దిగుతోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. పూనమ్ చేయి పట్టుకున్న వ్యవహారంపై బీజేపీ నేతల విమర్శల్ని వారు తిప్పికొడుతున్నారు.