అమ్మో! బంధువులా, వాళ్లతో వెళ్లను: ప్రత్యూష మాట
హైదరాబాద్: తాను చుట్టాల వద్ద ఉండదలుచుకోలేదని, వారితో వెళ్లనని తండ్రి రమేష్ కుమార్, సవతి తల్లి చాముండేశ్వరి అలియాస్ శ్యామల చేతుల్లో చిత్రహింసలకు గురై గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూష్ అంటోంది. తనకు రక్షణ కావాలని, చుట్టాలతో వెళ్లబోనని, విడిగానే ఉంటానని ఆమె చెబుతోంది. ఆడపిల్లగా పుట్టడం వల్లనే తనకు ఇన్ని కష్టాలు వచ్చాయని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది.
ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయిన తర్వాత ఎక్కడ ఉండాలని అనుకుంటోందో ప్రత్యూషను అడిగి తెలుసుకుని నివేదిక సమర్పించాలని హైకోర్టు గురువారంనాడు ఆదేశించింది. కాగా, కన్న తండ్రి, సవతి తల్లి వేధింపుల నుంచి బయటపడిన ప్రత్యూష నోరు విప్పింది. తమ అమ్మ బ్యూటీ పార్లర్ నడిపేదని, అమ్మ బ్యూటీ పార్లర్లో శ్యామల(సవతి తల్లి) పని చేసేదని ఆమె చెప్పింది.
అమ్మ లేనప్పుడు శ్యామల తన ఇంటికి వచ్చి పోయేదని, 2003లో అమ్మకు, నాన్నకు విడాకులయ్యాయని, 2008లో శ్యామలను నాన్న పెళ్లి చేసుకున్నాడని ఆమె చెప్పింది. 2010 డిసెంబర్ 27న అమ్మ చనిపోయిందని చెప్పింది.
అమ్మ చనిపోయిన తర్వాత అనాథ వసతి గృహంలో ఉన్నానని, అక్కడున్న వసతి గృహం హెడ్ అరుణ తనను హింసించేదని, ఆమె ఇంట్లో తనను పని మనిషిగా పెట్టుకుందని, అరుణ ఇంట్లో మూడేండ్లు నరకం అనుభవించానని, ఆ సమయంలోనే ఇంటర్ పూర్తి చేశానని, కొంత కాలం తర్వాత నాన్న తనను బలవంతంగా ఇంటికి తీసుకొచ్చాడని ఆమె చెప్పింది.
తనతో సవతి తల్లి ఫినాయిల్, హార్పిక్ తాగించేదని, హిట్, కారం తినిపించేదని, తినకపోతే రాడ్లతో కొట్టేదని, ఇనుప వస్తువులతో వాతలు పెట్టేదని, ఆమె బ్రష్ చేసిన తర్వాత ఆ ఉమ్మును తన నోట్లో ఉమ్చేదని ప్రత్యూష చెప్పింది.
నాన్న ముందే కింద పడేసి కాళ్లతో తన్నేదనిస అయినా నాన్న పట్టించుకోలేదని, బంధువులు ఇంటికి వస్తే ఏమైందని అడిగితే పిచ్చిది అని చెప్పేదని, కొన్ని సందర్భాల్లో బాత్రూమ్లో వేసి తాళమేసేదని ప్రత్యూష తన బాధలను నెమరేసుకుంది.ఇక ఇప్పుడైతే తనకు బాగా చదువుకోవాలని ఉందని, ఇప్పటికే నర్సింగ్ పూర్తి చేశానని చెప్పింది.