బాలుడిని ఎందుకు చంపారు?: హత్య కేసులో అన్నీ అనుమానాలే..
గాంధీనగర్లో దారుణహత్యకు గురైన కడారి వినయ్ని ఎవరు, ఎదుకు హతమార్చారనేది తేలడం లేదు.
వరంగల్: వరంగల్ అర్బన్ జిల్లా గాంధీనగర్లో దారుణహత్యకు గురైన మూడో తరగతి విద్యార్థి కడారి వినయ్ని ఎవరు, ఎదుకు హతమార్చారనే అంశం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అనుమానితులుగా భావిస్తూ అబ్బనికుంటకు చెందిన మధు, రాజేశ్లను ఇప్పటికే మిల్స్కాలనీ పోలీసులు అదుపులోకి తీసుకుని కూపీ లాగుతున్నారు.
అయితే, అధికారికంగా ఇంకా ఎలాంటి వివరాలు వెల్లడికాలేదు. బుధవారం సాయంత్రం క్రిస్టియన్ కాలనీలోని తాను చదువుతున్న యూనిక్ పాఠశాల నుంచి చిన్నారి ఇంటికి వెళ్లేందుకు ఉపక్రమించిన తరుణంలో అపహరణకు అనంతరం హత్యకు గురయ్యాడు. ఈ ఉదంతంపై పోలీసులు పూర్తిస్థాయిలో మరోమారు పాఠశాలలో ఆరా తీశారు.
గురువారం రాతి, శుక్రవారం స్థానికంగా ఉన్న సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించారు. పాఠశాల లోపల మాత్రమే సీసీ కెమెరాలు ఉండడంతో పాఠశాల వదిలిన అనంతరం బాలుడిని ఎవరు ఎత్తుకుపోయారు, ఎలా ఎత్తుకు పోయారనే విషయాలను పాఠశాల సమీపంలోని ఇళ్ల ముందు అమర్చిన సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించేందుకు యత్నించారు.
బాలుడి మృతదేహం గురువారం ఉదయం వెలుగు చూసిన నేపథ్యంలో డాగ్ స్క్వాడ్ ద్వారా లభించిన సాక్ష్యాలతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.బాలుడు బడి నుంచి బుధవారం సాయంత్రం ఇంటికి వెళ్లేందుకు రోజు వెళ్లే ఆటోలోనే తన బ్యాగును పెట్టి ఆటోలో కూర్చునే క్రమంలో అనుమానిత వ్యక్తిగా భావిస్తున్న మధు బాలుడిని పిలిచినట్లు సీసీ కెమెరాలో రికార్డు అయినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఆ వ్యక్తిని చూడగానే బాలుడు తనకు సుపరిచయస్తుడిగా భావించి బ్యాగును అందులోనే వదిలి అతని వద్దకు వెళ్లినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. అనంతరం వరంగల్ ఆటోనగర్ వైపు మరో వాహనంలో బాలుడిని తీసుకెళ్లి చంపినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు తెలిసింది.