నయీం అనుచరులమంటూ బెదిరింపు: రూ.50లక్షల డిమాండ్, అరెస్ట్
హైదరాబాద్: ఇటీవల పోలీసుల ఎదురుకాల్పుల్లో హతమైన గ్యాంగ్స్టర్ నయీం అనుచరులమని చెప్పుకొంటూ బెదిరింపులు, అపహరణలకు పాల్పడుతున్న నలుగురు నకిలీ మావోయిస్టులు బొల్లా నర్సింలు(30), పల్లెల సురేందర్(26), రాచకొండ శ్రీరాములు(32), అక్కరం కృష్ణ(32)లను రాచకొండ కమిషరేట్ పోలీసులు అరెస్ట్చేశారు.
నిందితుల నుంచి నుంచి రూ.3లక్షల నగదు, బొమ్మ పిస్తోలు, కారు, బైక్, ఐదు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని రాచకొండ పోలీస్ కమిషనర్ ఎం.మహేష్భగవత్ శనివారం విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. వీరి నాయకుడు సమ్మయ్య అలియాస్ సోమయ్య పరారీలో ఉన్నాడని, మూడేళ్ల నుంచి వీరు బెదిరింపులు, అపహరణలకు పాల్పడుతూ రూ.లక్షలు సంపాదించారని అన్నారు.
నల్గొండ జిల్లా గంధమల్లకు చెందిన బొల్లా నర్సింలు కొన్నేళ్ల క్రితం హైదరాబాద్కు వచ్చి మేస్త్రీగా పనిచేస్తూ స్తిరాస్థి వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో కరీంనగర్ జిల్లా హుజురాబాద్కు చెందిన మాజీమావోయిస్టు సమ్మయ్య పరిచయమయ్యాడు. డబ్బు సంపాదించేందుకు బెదిరింపులు, అపహరణలు చేద్దామని నర్సింలు చెప్పగా.. తాను గతంలో పోలీసుల సమక్షంలో లొంగిపోయానని, తనపేరుతో కాకుండా నయీం అనుచరులుగా చలామణి అవుతూ నేరాలకు పాల్పడదామంటూ సమ్మయ్య చెప్పాడు.

ఆ తర్వాత భువనగిరికి చెందిన సురేందర్, వీరారెడ్డిపల్లికి చెందిన కృష్ణ, మెదక్ జిల్లా జగదేవపూర్ నివాసి శ్రీరాములును భాగస్వామ్యులుగా చేర్చుకున్నారు. హైదరాబాద్ శివారులోని జవహర్నగర్లో మూడేళ్ల క్రితం గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. అప్పటినుంచి వ్యాపారులు, ఆసుపత్రుల యాజమాన్యాలు, సంపన్నులను లక్ష్యంగా చేసుకుని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు.
ఈ క్రమంలో సమ్మయ్య తాను నయీం అనుచరుడినంటూ బెదిరించేవాడు. డబ్బు ఇవ్వకపోతే వారిని అపహరించేవారు. ఇలా రాచకొండ, సైబరాబాద్, మెదక్ జిల్లాల్లో మూడేళ్ల నుంచి నేరాలకు పాల్పడుతున్నారు. బాధితుల్లో ఒకరిద్దరే ఫిర్యాదు చేయడంతో తీవ్రత తెలియలేదు. సెప్టెంబరు 14న జవహర్నగర్ ఠాణా పరిధిలోని ఆదిత్య ఆస్పత్రి బాధ్యుడు సురేంద్రచారికి ఫోన్చేసి రూ.50లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయగా ఆయన సమాధానం చెప్పలేదు.
పోలీసులకు ఈ సమాచారం తెలియడంతో ఫోన్కాల్స్పై నిఘా ఉంచారు. నర్సింలు, సురేందర్ ఆదిత్య ఆస్పత్రికి వచ్చి పరిసరాలను చూసేప్పుడు పోలీసులకు అనుమానం వచ్చి, వారిపై నిఘా ఉంచగా జవహర్నగర్లోని వారి గదిని తెలుసుకున్నారు. శనివారం ఆ గదిని ముట్టడించి నర్సింలుతోపాటు ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. వీరిపై తొమ్మిది కేసులున్నాయని మహేష్ భగవత్ చెప్పారు.
మెదక్ జిల్లాకు చెందిన పెద్ది శ్రీనివాసులు నుంచి డిసెంబర్ 2015లో రూ. 75వేలు, మరో నలుగురు నుంచి కూడా నయీం అనుచరులమంటూ రూ. 16.38లక్షలను ఈ నిందితులు బెదిరింపులకు గురి చేసి కాజేశారని ఆయన తెలిపారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు వివరించారు.












Click it and Unblock the Notifications