నందమూరి సుహాసినికి పురంధేశ్వరి ఆశీర్వాదం, టీడీపీ అభ్యర్థికి జగపతిబాబు మద్దతు
Recommended Video
హైదరాబాద్: మహాకూటమి పొత్తులో భాగంగా కూకట్పల్లి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని పోటీ చేస్తున్నారు. పెద్దిరెడ్డి, మందాడిలు పోటీ చేసేందుకు ఆసక్తి చూపారు. పెద్దిరెడ్డి రెండు నెలలు ప్రచారం కూడా చేశారు. కానీ అనూహ్యంగా సుహాసిని పేరు తెరపైకి వచ్చింది.
ఆమెకు టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ, తెలంగాణ జన సమితి అండగా ఉంటాయి. అయితే టీడీపీపై నిప్పులు చెరిగే బీజేపీ నాయకురాలు, కేంద్రమాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి కూడా సుహాసినికి మద్దతుగా మాట్లాడారు. సుహాసినికి తన ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుందని చెప్పారు. ప్రముఖ సినీ నటుడు జగపతి బాబు కూడా మద్దతిచ్చారు.
కేసీఆర్కు సవాల్ విసిరి అన్నంత పని చేసిన రేవంత్ రెడ్డి, కొండా తర్వాత మరొకరు ఎవరు?
మల్కాజిగిరిలో పురంధేశ్వరి ప్రచారం
పురంధేశ్వరి బీజేపీ అభ్యర్థి రామచంద్రా రావుకు మద్దతుగా మల్కాజిగిరిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. భావసారూప్యత, సిద్ధాంతాలు లేని మహాకూటమి, అవినీతిలో కూరుకుపోయిన తెరాసను ఓడించాలని పిలుపునిచ్చారు. అభివృద్ధిని కోరుకొని తమ జీవితాలు బంగారుమయం చేసే కమలం గుర్తుకు ఓటేయాలన్నారు. బీజేపీని ఓడించేందుకు, ప్రధాని నరేంద్ర మోడీని గద్దె దించేందుకు మాత్రమే మహాకూటమి ఏర్పడిందని ఆరోపించారు.
మోడీని ఎందుకు గద్దె దింపాలి?
మోడీని ఎందుకు గద్దె దింపాలో చెప్పాలని పురంధేశ్వరి ప్రశ్నించారు. అవినీతిరహిత పాలన అందిస్తున్నందుకా, పేదవారి కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినందుకా లేకుంటే మీ అవినీతికి సహకరించనందుకు గద్దె దింపాలా అని నిలదీశారు. తెలంగాణలో డబుల్ బెడ్రూం ఇళ్ల పథకానికి కేంద్రం నుంచి రూ.1170 వేల కోట్లు, స్వచ్ఛత కోసం రూ.100 కోట్లు వచ్చాయని, కానీ ఫలితం లేకుండా పోయిందన్నారు.
సుహాసినికి మద్దతుపై పురంధేశ్వరి
ఈ సందర్భంగా కూకట్పల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేస్తున్న నందమూరి సుహాసినికి మీ సహకారం ఉంటుందా అని ఓ జర్నలిస్ట్ అడిగారు. దానికి పురంధేశ్వరి నవ్వుతూ సమాధానం చెప్పారు. ఓ మేనత్తగా తన కోడలికి ఎప్పుడూ ఆశీర్వాదం ఉంటుందని, పార్టీ పరంగా తాము వ్యతిరేకంగా ఉన్నప్పటికీ మేనకోడలికి నా దీవెనలు ఉంటాయని చెప్పారు.
సుహాసినికి జగపతిబాబు అండ
కూకట్పల్లి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన నందమూరి సుహాసినికి జగపతి బాబు మద్దతు పలికారు. నియోజకవర్గ ప్రజలకు నిబద్దతతో కూడిన సేవ చేస్తారని తాను నమ్ముతున్నానని చెప్పారు. కూకట్పల్లి నియోజకవర్గం నుంచి ఆమెను అఖండ మెజార్టీతో గెలిపించాలన్నారు. సుహాసిని నిజాయితీ కలిగిన వ్యక్తి అన్నారు.