తెలంగాణలో రెన్యూసిస్ ఇండియా భారీ పెట్టుబడులు
తెలంగాణ రాష్ట్రంలో రూ. 6 వేల కోట్లతో దిగ్గజ పారిశ్రామిక సంస్థ రెన్యూ సిస్ ఇండియా పరిశ్రమ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. రాష్ట్రంలో సోలార్ పీవీ మాడ్యూల్, పీవీ సెల్స్ తయారీ యూనిట్లను నెలకొల్పడానికి రెన్యూసిస్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ ప్రణాళిక సిద్దం చేసుకుంది.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని ఫ్యాబ్ సిటీలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో ఆ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ ఒప్పందంపై సంతకాలు చేశారు. కర్ణాటక, మహారాష్ట్రలో ఈ సంస్థకు తయారీ యూనిట్లు ఉన్నప్పటికీ.. అతి పెద్ద తయారీ యూనిట్ను హైదరాబాద్లో నెలకొల్పాలని ఆ సంస్థ నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.

పరిశ్రమ ఏర్పాటు చేయడానికి కావాల్సిన అన్ని సహాయ సహకారాలను ప్రభుత్వం అందిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. రెన్యూసిస్ పరిశ్రమ ఏర్పాటు ద్వారా హైదరాబాద్ సోలార్ పరికరాల తయారీకి హబ్గా మారనుందని శ్రీధర్బాబు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీని ప్రోత్సహిస్తోందని, ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షిస్తామని, ఇందు కోసం సమగ్ర ఇంధన పాలసీని రూపొందిస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
మరోవైపు, టీఎస్ఐఐసీ ఏరోస్పేస్ పార్కులో అపోలో మైక్రోసిస్టమ్స్ సంస్థ ఏర్పాటు చేస్తున్న వెపన్స్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ యూనిట్ భూమి పూజ కార్యక్రమంలోనూ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ పరిశ్రమ వల్ల రానున్న మూడేళ్లలో దాదాపు 400 మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి తెలిపారు. తెలంగాణలో ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలు కోర్ రంగాలుగా ఉన్నాయని, ఈ రంగాల్లో అనేక ఎంఎస్ఎంఈ పరిశ్రమలు ఉన్నాయని శ్రీధర్బాబు వెల్లడించారు.












Click it and Unblock the Notifications