టి కాంగ్రెస్కు తగిన శాస్తి జరిగింది: రేవంత్, ‘ఇక కెసిఆర్ టార్గెట్ బిజెపినే’
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. టిఆర్ఎస్లోకి కాంగ్రెస్ నేతలు జంప్ అవడంతో ఆ పార్టీకి తగిన శాస్తి జరిగిందని ఆయన అన్నారు. బుధవారం జరిగిన టీడీపీ వర్క్షాప్లో పాల్గొన్న రేవంత్రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి తగిన శాస్తి జరిగిందని వ్యాఖ్యానించారు.
కొన్ని నెలల క్రితం టీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ ఆకర్షిస్తున్నప్పుడే ఆ విషయంపై కేసీఆర్ తీరును ప్రశ్నించమని తాను కాంగ్రెస్ నేతలను కోరినట్లు ఆయన తెలిపారు. ఈ విషయమై ప్రశ్నించాలని తాను కాంగ్రెస్ నేతలను పలుసార్లు అడిగానని ఆయన చెప్పారు. అప్పుడు స్పందించని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు అందరం కలసి గళం విప్పుదామని అంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
అసెంబ్లీ నుంచి 15 మంది టీడీపీ ఎమ్మెల్యేలను బయటకు ఈడ్చినప్పుడు మళ్లీ చెప్పానన్నారు. కేసీఆర్ తప్పును ప్రశ్నించమని అడిగానని, ప్రశ్నించకపోతే భవిష్యత్లో వారికి ఇదే పరిస్థితి వస్తుందని హెచ్చరించినా అప్పుడు కాంగ్రెస్ వాళ్లు పట్టించుకోలేదన్నారు.
పార్టీ ఫిరాయింపులపై మరోవైపు బీజేపీ కూడా స్పందించడం లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ నేతలను ఆకర్షించిన తరువాత బీజేపీ నేతలపై కేసీఆర్ దృష్టి పెడతారని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. త్వరలోనే తెలంగాణ రాజకీయాల్లో స్పష్టత వస్తుందని రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
టిపిసిసి సమన్వయ కమిటీ సమావేశం
ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి, మాజీ ఎంపీ వివేక్ ఎమ్మెల్యే భాస్కర్రావు సహా పలువురు నేతల పార్టీ ఫిరాయింపుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మేధోమథనం ప్రారంభించింది. ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్సింగ్, ఏఐసీసీ పరిశీలకులు ఆర్సీ కుంతియా, కొప్పుల రాజుల గాంధీభవన్లో పార్టీ సమన్వయం కమిటీ సమావేశాన్ని ఏర్పాటుచేశారు.
ఈ సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, శాసనసభాపక్ష నేత జానారెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క, పార్టీ నేతలు దామోదర రాజనర్సింహ, వి.హనుమంతరావు, షబ్బీర్ అలీ, రేణుకాచౌదరి, డీకే అరుణ, సబితా ఇంద్రారెడ్డి తదితరులు హాజరయ్యారు.
పార్టీ నుంచి ముఖ్య నేతలు వెళ్లిపోవడం, క్రమశిక్షణ చర్యలు, పార్టీ వ్యవస్థ నిర్మాణం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఎవరు పార్టీని వీడినా పార్టీకి కార్యకర్తలే బలమని... వారే ఉత్సాహంగా పార్టీని నడిపించాలని దిగ్విజయ్సింగ్ సూచించారు. క్రమశిక్షణతో పనిచేసేవారికి కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు ఉంటుందని చెప్పారు.