అధికారం లైసెన్స్ గా భావించొద్దు.. టీఆర్ఎస్ కు రేవంత్ రెడ్డి చురకలు
కొడంగల్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి స్పందించారు. ఇప్పుడే ఏం మాట్లాడలేమని.. పార్టీ నేతలతో కూలంకషంగా చర్చించాక వివరాలు వెల్లడిస్తామన్నారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయా, టీఆర్ఎస్ ప్రలోభాలకు గురిచేసిందా లాంటి విషయాలపై సమగ్ర చర్చ అవసరమన్నారు. రాజకీయంలో గెలుపోటములు సహజమేనని.. వాటితో సంబంధం లేకుండా ప్రజాపక్షం వహిస్తామని చెప్పుకొచ్చారు. దాదాపు యాభై ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్.. గెలుపోటములను ఒకే రీతిన చూస్తుందని చెప్పారు
అటు ఓటమిని అంగీకరిస్తూనే.. ఇటు టీఆర్ఎస్ పై ఆరోపణలు గుప్పించారు రేవంత్ రెడ్డి. ఈ విజయాన్ని టీఆర్ఎస్ అదనుగా తీసుకోవద్దని హితవు పలికారు. రాష్ట్రాన్ని దోచుకోవడానికి ప్రజలిచ్చిన లైసెన్స్ గా భావించొద్దని ఎద్దేవా చేశారు. రైతుల ఆత్మహత్యలు ఆపాలని, అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయాలని, నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని సూచించారు.