కెసిఆర్ లో చలనం రావాలంటే ఇంకెందరు రైతులు బలి కావాలి? రేవంత్ రెడ్డి మండిపాటు
తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల రగడ కొనసాగుతోంది. తెలంగాణ రైతాంగం సాగుచేసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు టిఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుంటే, రైతుల పక్షాన పోరాటం చెయ్యటం కోసం కాంగ్రెస్ కూడా ప్రజా క్షేత్రంలోకి వెళ్ళింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జేఏసీగా, జాయింట్ యాక్టింగ్ కమిటీగా ఏర్పడి రైతులను మోసం చేస్తున్నాయని టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇప్పటికే బీజేపీ, టీఆర్ఎస్ లపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన విషయం తెలిసిందే.

ధాన్యం కొనుగోళ్ళ విషయంలో కేసీఆర్ సర్కార్ పై ఒత్తిడి తెస్తున్న కాంగ్రెస్
ఇక ధాన్యం కొనుగోళ్ళ విషయంలో టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ కేసీఆర్ సర్కార్ కు ఊపిరాడనివ్వకుండా చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు విషయంలో టిఆర్ఎస్ సర్కారుపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేసిన రేవంత్ రెడ్డి రైతాంగానికి అండగా పోరాటం సాగిస్తున్నారు. కల్లాల్లో రైతులు పడుతున్న ఇబ్బందులను నేరుగా అడిగి తెలుసుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసి తీరాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని టిఆర్ఎస్ పాలకులు డ్రామాలాడుతున్నారని, ధాన్యం కొనుగోలు విషయంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి రైతుల పక్షపాతిగా రైతుల కోసం పోరాటం సాగించే పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని తేల్చి చెప్పారు.

కేసీఆర్ సర్కార్ తీరుతో రైతుల ప్రాణాలు పోతున్నాయని ఆగ్రహం
తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు జరగకపోవడంతో ఇప్పటికే అనేక మంది రైతులు ఐకెపి కేంద్రాల వద్ద తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న పరిస్థితులను కళ్లారా చూసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరుతో రైతుల ప్రాణాలు పోతున్నాయి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు రోజుల తరబడి ధాన్యం కొనుగోలు కోసం ఎదురు చూడాల్సి వస్తుందని అసహనం వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారంటూ మండిపడ్డారు. రైతుల విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న ప్రభుత్వ తీరుపై ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. వర్షంలో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చెయ్యాలని, చనిపోయిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రైతుల ధాన్యం కొనకుంటే ప్రగతి భవన్ ముట్టడిస్తామని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది.

కెసిఆర్ బండరాయి లాంటి నీ గుండెకు చలనం లేదా? రేవంత్ ప్రశ్న
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం, అడ్లూర్ ఎల్లారెడ్డిలో రైతు రాజయ్య ఇటీవల గుండెపోటుతో వరి కుప్పపై ప్రాణాలు వదిలాడు అని, కెసిఆర్ బండ రాయి లాంటి నీ గుండెకు చలనం లేదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కెసిఆర్ లో చలనం రావాలంటే ఇంకెందరు రైతులు బలి కావాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లకు ధాన్యం కొనుగోలు చేయాలని వినతి పత్రాలు ఇచ్చిన కార్యక్రమాన్ని నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ, రైతుల సమస్యలపై పోరాటం చేస్తుందని, రైతుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు కాంగ్రెస్ పార్టీ విరమించేది లేదని తేల్చి చెబుతున్నారు.












Click it and Unblock the Notifications