హైదరాబాద్ కూడా: ఎస్బీఐలోకి ఐదు బ్యాంకుల విలీనం, లాభపడ్డ షేర్లు
హైదరాబాద్: ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లోకి అనుబంధ బ్యాంకులను విలీనం చేసే ప్రతిపాదనకు కేంద్ర మంత్రి వర్గం బుధవారం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో ఎస్బీఐ ఐదు అనుబంధ బ్యాంకులతో పాటు భారతీయ మహిళా బ్యాంకు కూడా ఎస్బీఐలో విలీనం కానున్నాయి.
కాగా, ఎస్బీఐకి చెందిన అనుబంధ బ్యాంకులైన స్టేట్బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్, స్టేట్బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లతో పాటు మహిళా బ్యాంకు విలీన ప్రతిపాదనకు ఎస్బీఐ గత నెలలోనే ఆమోద ముద్ర వేసింది.
కేంద్ర మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాన్ని పలు బ్యాంకులు స్వాగతించాయి. విలీన వార్తలతో స్టాక్ మార్కెట్లో ఎస్బీఐ అనుబంధ బ్యాంకులు లాభాలను నమోదు చేశాయి. స్టేట్బ్యాంక్ ఆఫ్ మైసూర్ షేరు 20 శాతం పెరగ్గా... స్టేట్బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్ షేరు 18 శాతంకు పైగా లబ్ధి పొందింది.
ఇక స్టేట్బ్యాంక్ ఆఫ్ బికనీరు అండ్ జైపూర్ షేరు 16శాతం పెరిగింది. బ్యాంకు షేర్లు లాభాలను నమోదు చేయడంతో సెన్సెక్స్ 331 పాయింట్లు, నిఫ్టీ దాదాపు 98 పాయింట్లు లాభపడ్డాయి. ఎస్బీఐలో విలీనం కానున్న ఐదు బ్యాంకుల్లో మూడు మాత్రమే లిస్టెడ్ బ్యాంకులు.
బ్యాంకుల్లో పెరుగుతున్న మొండి బకాయిలు, పబ్లిక్ రంగ బ్యాంకులను సుస్థిర దిశకు తీసుకొచ్చేందుకు కేంద్రం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ విలీనంతో ఎస్బీఐ నెట్వర్క్లు దేశ వ్యాప్తంగా 41 శాతం పెరగనున్నాయి. 23వేల ఎస్బీఐ బ్రాంచ్లు అందుబాటులోకి రానున్నాయి.
కాగా ఎస్బీఐ 2008లో తొలిసారి స్టేట్బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్రను విలీనం చేసుకొంది. అనంతరం రెండేళ్ల తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్ను విలీనం చేసుకుంది. ఈ విలీనంతో రూ.37లక్షల కోట్ల విలువైన ఆస్తులు, 22,500 శాఖలు, 60,000 ఏటీఎంలు ఒక్కటిగా అయ్యాయి.
ఇందులో ఒక్క ఎస్బీఐకే 16,500 శాఖలు, 36 దేశాల్లో 199 ఆఫీసులు ఉన్నాయి. ప్రస్తుతం జరగనున్న విలీనంతో ఎస్బీఐ ఉద్యోగుల సంఖ్య 33 శాతానికి పెరిగి 2,85,500కు చేరుకుంటుంది. ఈ విలీన ప్రక్రియ ఐదు నెలల్లో పూర్తి కావొచ్చని భావిస్తున్నారు.
మరోవైపు ఎస్బీఐలోకి ఐదు బ్యాంకుల విలీనాన్ని ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇందులో భాగంగా జూన్ 28, 29న బంద్కు, నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి. ఈ బంద్కు వామపక్ష పార్టీలు మద్దతిస్తున్నాయి.