జాతీయ రాజకీయాల్లో మార్పు తథ్యం, త్వరలోనే సంచలన ప్రకటన: మోడీకి కేసీఆర్ కౌంటర్
బెంగళూరు/హైదరాబాద్: దేశంలో గుణాత్మక మార్పు రావాలని, రెండు మూడు నెలల్లో సంచలన ప్రకటన వింటారని తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. బెంగళూరులో గురువారం మధ్యాహ్నం జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ సీఎం కుమారస్వామితో కేసీఆర్ సమావేశమైన విషయం తెలిసిందే. అనంతరం ఆయన కుమారస్వామితో కలిసి మీడియాతో మాట్లాడారు.

రెండు మూడు నెలల్లో సంచలన వార్త వింటారంటూ కేసీఆర్
దేవెగౌడ, కుమారస్వామితో జాతీయ, కర్ణాటక రాజకీయాలపై చర్చించినట్లు కేసీఆర్ చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్నా.. ఇప్పటికే దేశంలో మంచినీరు, విద్యుత్, సాగునీటి కోసం ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదని కేసీఆర్ అన్నారు. దేశంలో గుణాత్మక మార్పు రావాలని, రెండు మూడు నెలల్లో సంచలన వార్త వింటారని వ్యాఖ్యానించారు. జాతీయ స్థాయిలో మార్పు వచ్చి తీరుతుందని, దీన్ని ఎవరూ ఆపలేరన్నారు.

ఆ రెండు పార్టీలతో ఎవరికీ సంతోషం లేదన్న కేసీఆర్
కాంగ్రెస్, బీజేపీ పాలనలో ఎవరూ సంతోషంగా లేరని.. చరిత్రలో ఎన్నడూ లేనంతగా రూపాయి విలువ పడిపోయిందన్నారు కేసీఆర్. జీడీపీలో భారత్ను చైనా అధిగమించిందని తెలిపారు. సంకల్పముంటే అమెరికా కంటే బలమైన ఆర్థికశక్తిగా భారత్ను తీర్చి దిద్దవచ్చన్నారు. ఉజ్వల భారత్ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. జాతీయ రాజకీయాలే ఎజెండాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనలు కొనసాగిస్తున్నారు. ఇటీవల ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, యూపీ మాజీ సీఎం, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్లతో కేసీఆర్ భేటీ అయిన విషయం తెలిసిందే.

మాజీ ప్రధాని, మాజీ సీఎంలతో కేసీఆర్ కీలక భేటీ
తాజాగా, గురువారం మధ్యాహ్నం బెంగళూరుకు చేరుకున్నారు కేసీఆర్. ఆయనకు జేడీఎస్ అగ్రనేత, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, జేడీఎస్ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం పద్మనాభనగర్లోని మాజీ ప్రధాని దేవెగౌడ నివాసానికి వెళ్లారు.
దేవెగౌడ నివాసంలోనే సీఎం కేసీఆర్, ఎంపీ సంతోష్ కుమార్తో సహా పలువురు నేతలు మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం దేవెగౌడ, కుమారస్వామితో కలిసి భేటీ అయ్యారు. కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ కూడా భేటీలో పాల్గొన్నారు.
దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, జాతీయ రాజకీయాలు, రాష్ట్రాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనురిస్తున్న విధానం సహా తాజా పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై దేవెగౌడ, కుమారస్వామితో సీఎం కేసీఆర్ చర్చించినట్లు సమాచారం.
రానున్న రోజుల్లో అనుసరించాల్సిన కార్యాచరణ, ప్రాంతీయ పార్టీల పాత్ర, తదితర అంశాలపై కూడా సమాలోచనలు జరిపారు. త్వరలో జరగనున్న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది.

మోడీ వ్యాఖ్యలకు కేసీఆర్ కౌంటర్
'ప్రసంగాలు చాలానే ఉంటాయి.చాలా వాగ్దానాలు చేస్తారు, కానీ వాస్తవం ఏమిటి? పరిశ్రమలు మూతపడుతున్నాయి, జీడీపీ పడిపోతోంది, ద్రవ్యోల్బణం పెరుగుతోంది... రైతులు, దళితులు, గిరిజనులు అసంతృప్తిగా ఉన్నారు' అని ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ బీజేపీ సభలో చేసిన వ్యాఖ్యలకు సీఎం కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు. మోడీ పాలనలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదని అన్నారు. కేంద్రంలో ఎవరి సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడుతుందన్నది ఇక్కడ ప్రధానం కాదని, ఒక ఉజ్వల భారతం కోసం శ్రమించాల్సిన అవసరం వుందని కేసీఆర్ పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications