కేసీఆర్ క్షమాపణ చెప్పాల్సిందే, సీపీఎంపై దూషణ సిగ్గుచేటు: సున్నం రాజయ్య
బుధవారం నాడు కేసీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల అభ్యంతరం తెలుపుతూ గురువారం నాడు సీపీఎం ఎమ్మెల్యే రాజయ్య స్పీకర్ కు లేఖ ఇచ్చారు.
హైదరాబాద్: సీపీఎం పార్టీని ఉద్దేశిస్తూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల ఆ పార్టీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. సీపీఎం పార్టీపై సీఎం దూషణలు సిగ్గుచేటని అన్నారు. సీపీఎంపై అనుచిత వ్యాఖ్యలకు సీఎం కేసీఆర్ క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.
ప్రజా సమస్యల పోరాటంలో సీపీఎం పార్టీ ఎప్పుడూ ముందుంటుందని, అలాంటి పార్టీపై సీఎం చేసిన వ్యాఖ్యలకు గాను ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్పీకర్ కు లేఖ ఇచ్చామని సున్నం రాజయ్య పేర్కొన్నారు.
కాగా, బుధవారం నాడు అసెంబ్లీలో మల్లన్న సాగర్ అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో సీపీఎంను ఎద్దేవా చేస్తూ సీఎం కేసీఆర్ పలు వ్యాఖ్యలు చేశారు. మల్లన్న సాగర్ కోసం 75శాతం మంది రైతులు స్వచ్చందంగా భూములిచ్చేందుకు ముందుకు వచ్చారని కేసీఆర్ అన్నారు. ఉద్దేశపూర్వకంగానే కొంతమంది అక్కడ అల్లర్లు సృష్టించి కాల్పులు జరిగేలా కుట్రలు చేస్తున్నారని.. వాటన్నింటిని తాము కళ్లు మూసుకుని చూస్తూ కూర్చోవాలా? అని కేసీఆర్ ప్రశ్నించారు.
'సీపీఎం సెక్రటరీ టూ వీలర్ మీద పోయిండు. హైదరాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి నుంచి వచ్చి మల్లన్నసాగర్లో అగ్గిపెట్టాలె. పోలీసు కాల్పులు జరపాలె అని భావించారు. ముదిగొండ, అంగన్వాడీలపై కాల్పులకు సీపీఎం కారణం. గుండుసూది పార్టీ, సూది పార్టీ, దబ్బనం పార్టీలున్నాయి. పోలీసులొస్తే గుచ్చాలి. లాఠీచార్జీ జరగాలి. ఆ దెబ్బలను చూపించే రాజకీయం చేయాలి. దిక్కుమాలిన రాజకీయ వ్యూహాలు. అందుకే పోలీస్ పికెట్ పెట్టాం' అంటూ కేసీఆర్ సీపీఎంను దుయ్యబట్టారు.
ప్రాజెక్టుల కోసం ఎక్కడ చిన్న గొడవ జరిగినా.. ఓ ముఠా అక్కడికి పోతుందని, అందులో రచనారెడ్డి అనే ఓ పచ్చి అబద్దాల అడ్వకేట్ ఉంటారని సీఎం కేసీఆర్ ఆరోపించారు. సాధించుకున్న రాష్ట్రాన్ని బాగు చేయడమే తమ లక్ష్యమని, లేనిపోని అవాంతరాలు సృష్టించి ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నందుకే కర్ఫ్యూ విధించామని అన్నారు.
బుధవారం నాడు కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యల పట్ల అభ్యంతరం తెలుపుతూ గురువారం నాడు సీపీఎం ఎమ్మెల్యే రాజయ్య స్పీకర్ కు లేఖ ఇచ్చారు.