నేను! జగన్కు అనుకూలమా?: తలసాని, ‘బాబు వల్లే రోజా ఇష్యూ పెద్దదైంది’
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు, తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వాస్తవాలు మాట్లాడితే టీడీపీ నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారని మండిపడ్డారు.
మంగళవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ.. తానేం మాట్లాడినా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డికి అనుకూలంగా మాట్లాడుతున్నావంటూ ఆరోపిస్తున్నారని మండిపడ్డారు.
'మీరొకసారి నాతో ఏపీ లాబీల్లోకి వచ్చినా పక్కన నిలబడి గమనించండి. ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎమ్మెల్యేల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎంత కోపం, ఎంత అసంతృప్తి ఉన్నాయో అర్థమవుతుంది' అని శ్రీనివాస యాదవ్ అన్నారు.
ఏపీ అసెంబ్లీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ విషయంపై స్పందిస్తూ.. 'గోరుతో పోయేదాన్ని.. గొడ్డలి దాకా తెచ్చుకున్నారు' అని చంద్రబాబు ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
చంద్రబాబు తీరు గురించి మాట్లాడితే జగన్కు అనుకూలంగా మాట్లాడానని భావిస్తున్నారని, నిజాలు మాట్లాడడానికి ఎవరైతే ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ టీడీపీ నేత ఒకరు దొరికిన దొంగ అని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని ఉద్దుశించి అన్నారు. ఆ నాయకుని గురించి ఎక్కువగా స్పందించదలుచుకోలేదని వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.