‘రైతులను ఇంతలా అవమానిస్తారా?.. మీకు మూడింది’: కేసీఆర్ సర్కారుపై నిప్పులు
ఖమ్మం మార్కెట్ యార్డులో విధ్వంసానికి పాల్పడ్డారంటూ అరెస్ట్ చేసిన రైతులకు బేడీలు వేసి కోర్టుకు తీసుకురావడంపై రాజకీయ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్: ఖమ్మం మార్కెట్ యార్డులో విధ్వంసానికి పాల్పడ్డారంటూ అరెస్ట్ చేసిన రైతులకు బేడీలు వేసి కోర్టుకు తీసుకురావడంపై రాజకీయ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు బేడీలు వేసి ఇంతలా అవమానిస్తారా? అంటూ సీఎం కేసీఆర్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.
రాజద్రోహం కేసులా..?: కేసీఆర్కు రేవంత్ బహిరంగ లేఖ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరో బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలోని రైతులను టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని లేఖలో ఆరోపించారు. గిట్టుబాటు ధర అడిగిన రైతులపై రాజద్రోహం కేసులను పెట్టడమేంటని ప్రశ్నించారు.

రాష్ట్రానికి వెన్నెముక అయిన రైతులకు దొంగల్లా బేడీలు వేయడం ఏమిటని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో కూడా ఇంత దారుణానికి అప్పటి ప్రభుత్వాలు పాల్పడలేదని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని ధ్వజమెత్తారు.
ఇంతలా అవమానిస్తారా?: క్షమాపణలు చెప్పాల్సిందే..
సీఎం కేసీఆర్ తక్షణమే రైతులకు క్షమాపణ చెప్పాలని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఖమ్మం రైతులకు సంకెళ్లు వేసి కోర్టుకు తీసుకురావడం దారుణమన్నారు. రైతు సమాజానికి ఇది అవమానమని, కేసీఆర్ తక్షణం రైతులకు క్షమాపణ చెప్పాలన్నారు.
బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయాలని ఉత్తమ్ పేర్కొన్నారు. రైతులేమైనా తీవ్రవాదులా? అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం ఇంతకింత అనుభవించాల్సి ఉంటుందన్నారు. రైతులు కన్నెర్ర చేస్తే ప్రభుత్వం పతనం ఖాయమని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ధ్వజమెత్తారు.
కాగా, మిర్చి మార్కెట్ విధ్వంసం కేసులో అరెస్టయిన రైతుల్ని పోలీసులు గురువారం కోర్టులో హాజరుపరిచారు. ఆ సమయంలో వారి చేతులకు బేడీలు వేసి ఉన్నాయి. రైతులకు బేడీలు వేయడంపై రైతు సంఘాల నాయకులు, విపక్ష పార్టీల నాయకులు మండి పడుతున్నారు. ఇది ఇలా ఉండగా, రైతులకు బేడీలు వేసి కోర్టుకు తీసుకురావడంపై సీపీ ఇక్బాల్ స్పందించారు. రైతులకు బేడీలు వేసిన బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
బెయిల్ మంజూరు
ఖమ్మం మార్కెట్ యార్డుపై ఇటీవల దాడి ఘటనలో అరెస్టయిన రైతులకు జిల్లా న్యాయస్థానం గురువారం బెయిల్ మంజూరు చేసింది. మొత్తం 10 మంది రైతులకు మూడు కేసుల్లో బెయిల్ మంజూరు చేసింది. మే 8న ఒక కేసులో బెయిల్ మంజూరుచేసిన న్యాయస్థానం.. గురువారం మిగిలిన మరో రెండు కేసుల్లోనూ బెయిల్ ఇస్తున్నట్టు వెల్లడించింది.












Click it and Unblock the Notifications