మోత్కుపల్లికి షాక్: వివరణ కోరనున్న టిడిపి, ఆ ఘటనపై కేంద్ర కమిటీకి నివేదిక
హైదరాబాద్: మాజీ మంత్రి , టిడిపి పొలిట్బ్యూరో సభ్యుడు నర్సింహులును వివరణ కోరాలని టిడిపి తెలంగాణ రాష్ట్ర కమిటీ అభిప్రాయపడింది. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా తెలంగాణ టిడిపి రాష్ట్ర శాఖను టిఆర్ఎస్లో విలీనం చేయాలని మోత్కుపల్లి నర్సింహులు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.దీంతో టిడిపి తెలంగాణ రాష్ట్ర కమిటీ ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకొంది.
ఎన్టీఆర్ వర్థంతిని పురస్కరించుకొని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రాలేదని మోత్కుపల్లి నర్సింహులు అసంతృప్తి వ్యక్తం చేశారు. జనవరి 18వ, తేదిన ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్ కు నివాళులర్పించిన తర్వాత మోత్కుపల్లి నర్సింహులు వివాదాస్పద కామెంట్లు చేశారు.
తెలంగాణలో టిడిపి అంతరించిపోతోంది, దీంతో తెలంగాణ టిడిపి రాష్ట్ర శాఖను టిఆర్ఎస్ లో విలీనం చేయాలని మోత్కుపల్లి నర్సింహులు అభిప్రాయపడ్డారు. అయితే ఈ వ్యాఖ్యలపై తెలంగాణ టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ అభ్యంతరం వ్యక్తం చేశారు. టిడిపికి ఎలాంటి ఇబ్బంది లేదని ఆయన తేల్చి చెప్పారు.

మోత్కుపల్లి వివరణ కోరాలని టిడిపి నిర్ణయం
టిడిపి తెలంగాణ రాష్ట్ర కమిటీని టిఆర్ఎస్లో విలీనం చేయాలని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు చేసిన సూచనపై వివరణ కోరాలని తెలంగాణ టిడిపి రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. తెలంగాణ టిడిపి పొలిట్ బ్యూరో, రాష్ట్ర కమిటీ సమావేశం శనివారం హైద్రాబాద్ లో జరిగింది. ఈ సమావేశంలో ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని మోత్కుపల్లి నర్సింహులు చేసిన వ్యాఖ్యలపై చర్చించారు.ఏ కారణంగా ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందనే విషయమై వివరణ ఇవ్వాలని మోత్కుపల్లి నర్సింహులును పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకొంది.

మోత్కుపల్లి ఘటనపై కేంద్ర కమిటీకి నివేదిక
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మోత్కుపల్లి నర్సింహులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేంద్ర కమిటీకి నివేదిక ఇవ్వాలని టిడిపి తెలంగాణ రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకొంది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా చోటు చేసుకొన్న పరిణామాలు మోత్కుపల్లి చేసిన వ్యాఖ్యలపై ఈ నివేదికలో చోటు కల్పించే అవకాశం ఉంది.రేవంత్ రెడ్డి ఎపిసోడ్ సమయంలోనే మోత్కుపల్లి నర్సింహులు టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకొంటే ప్రయోజనమని అభిప్రాయపడ్డారు.

టిడిపి ఓటు బ్యాంకుపై టిఆర్ఎస్ కన్ను
వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ రెండు రోజుల క్రితమే ప్రకటించారు.2014 ఎన్నికల సమయంలో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్, తెలంగాణకు టిడిపి వ్యతిరేకమని టిఆర్ఎస్ చేసిన ప్రచారాన్ని అధిగమిస్తూ 15 అసెంబ్లీ, 1 ఎంపీ స్థానాన్ని గెలుచుకొంది. టిడిపి గెలుచుకొన్న 15 అసెంబ్లీ స్థానాల్లో 12 అసెంబ్లీ స్థానాలు గ్రేటర్ హైద్రాబాద్ నియోజకవర్గానికి చెందినవే.దీంతో టిడిపికి వెన్నుదన్నుగా కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకొని టిఆర్ఎస్ పావులు కదుపుతోంది. ఈ మేరకు వెల్కమ్ వ్యూహన్ని అమలు చేస్తోంది. దీనికితోడు బీసీలు కూడ టిడిపికి కొంత మొగ్గుచూపుతున్నారు. ఆ వర్గాలను కూడ ఆకర్షించేందుకు కెసిఆర్ ఇటీవలనే సంక్షేమ పథకాల్లో బీసీలకు పెద్ద పీట వేయనున్నట్టు ప్రకటించారు.

కాంగ్రెస్ను దెబ్బతీసేందుకు
ఇటీవల కాలంలో చోటు చేసుకొంటున్న రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ కూడ కొంత పుంజుకొంటున్నట్టు రాజకీయ విశ్లేషకులు అబిప్రాయపడుతున్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీకి మేలు జరగకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో టిఆర్ఎస్ పావులు కదుపుతోంది. ఇప్పటివరకు టిడిపికి అనుకూలంగా ఉన్న వర్గాలను తమ వైపుకు తిప్పుకొనేందుకుగాను టిఆర్ఎస్ వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే మోత్కుపల్లి నర్సింహులు టిడిపిని రాష్ట్ర శాఖను టిఆర్ఎస్ లో విలీనం చేస్తే తప్పేంంటనే ప్రతిపాదనను ముందుకు తెచ్చారనే అభిప్రాయం కూడ లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications