షాక్: 'కవిత కోసమే కడియంకు కేసీఆర్ పదవిచ్చారు'
హైదరాబాద్: తన ముద్దుల కూతురు, నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత బుగ్గకారు కోరిక తీర్చేందుకే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఢిల్లీ వెళ్లారని తెలుగుదేశం పార్టీ నేత సతీష్ మాదిగ అన్నారు. కవితకు మంత్రి పదవి ఇస్తే కడియం శ్రీహరి అడ్డుపడతారని భావించి ఎంపీగా ఉన్న ఆయనను మంత్రిని చేశారన్నారు. టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకుంటేనే పెన్షన్లు ఇస్తామని ప్రలోభ పెట్టడం సరికాదన్నారు.
పొత్తుపై బండారు దత్తాత్రేయ
భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితిల మధ్య స్నేహానికి సంబంధించి ఎలాంటి చర్చలు జరగలేదని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ మంగళవారం చెప్పారు. మిషన్ కాకతీయకు కేంద్రం నుండి నిధులు తెస్తామని ఆయన చెప్పారు. వేములవాడను రైల్వేతో అనుసంధానం చేస్తామని చెప్పారు.
వచ్చే పార్లమెంటు సమావేశాలలో రాజ్యసభ ముందుకు బాలకార్మిక చట్టం తీసుకు వస్తామని చెప్పారు. వ్యవసాయ కూలీల సామాజిక భద్రతకు ప్రత్యేక పథకం తీసుకు వస్తామన్నారు.
నల్గొండలో టీఆర్ఎస్, కాంగ్రెస్ ఫ్లెక్సీ వివాదం
మహా శివరాత్రి సందర్భంగా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల మధ్య ఉద్రిక్తతలకు దారి తీసింది. తాము ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని చించేసి కాంగ్రెస్ నేతలు వారి ఫ్లెక్సీని పెట్టారంటూ టీఆర్ఎస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నల్గొండ మున్సిపల్ చైర్మన్ భర్తను అదుపులోకి తీసుకున్నారు. అయితే తనను అకారణంగా అరెస్ట్ చేశారంటూ శ్రీనివాస్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.