గవర్నర్ నరసింహన్తో సీఎం కేసీఆర్ భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. ఇటీవల బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై తెలంగాణ వైఖరి ఎలా ఉండబోతుంది అన్నది గవర్నర్కు కేసీఆర్ వివరించారు. ఇప్పటికే ట్రిబ్యునల్ తీర్పు అధ్యయనానికి మంత్రి హరీష్ రావు అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసిన విషయం..కమిటీ అధ్యయనంలోని వివరాలను నరసింహన్ దృష్టికి తీసుకెళ్లారు కేసీఆర్. శనివారం బ్రిజేష్ తీర్పుపై మరోసారి జరగనున్న మంత్రివర్గ ఉపసంఘం భేటీలో.. సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ సలహామేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు గవర్నర్కు చెప్పారు ముఖ్యమంత్రి. అవసరమైతే తెలుగు రాష్ట్రాలు రెండు కలిసి.. ట్రిబ్యునల్ తీర్పును సవాల్ చేస్తూ.. సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశలను ఆయనకు వెల్లడించారు. కృష్ణా జలాలను నాలుగు రాష్ట్రాలమధ్య పున:పంపిణీ చేయాల్సిందేనని, ఈ విషయంలో అటు కేంద్రం.. ఇటు ట్రిబ్యునల్ ఎదుట తమ వాదనలు కొనసాగిస్తూనే ఉంటామన్న విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు కేసీఆర్.