ఏపీ నిధులపై కన్నేసిన తెలంగాణ: కేంద్రం వద్దే తేల్చుకుంటాం: మంత్రి హరీష్ రావు ఘాటు లేక
హైదరాబాద్: ఏపీ నిధులపై తెలంగాణ కన్నేసింది. వాటిని తమ రాష్ట్రానికి బదలాయించుకోవడానికి కసరత్తు మొదలు పెట్టింది. కేంద్రం వద్దే తేల్చుకోవడానికి సన్నద్ధమైంది. ఇందులో భాగంగా తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి టీ హరీష్ రావు లేఖాస్త్రాన్ని సంధించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఆయన లేఖ రాశారు. ఏపీకి బదలాయించిన నిధులను తమకు కేటాయించాలనీ డిమాండ్ చేశారు.
రూటు మార్చిన రేవంత్ రెడ్డి..!!
ఆ నిధుల విలువ 495.20 కోట్ల రూపాయలు. సెంటర్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద కేంద్రం వాటిని మంజూరు చేస్తుంటుంది. ఈ నిధులను తమకు ఇప్పించాలంటూ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. 2014-2015 ఆర్థిక సంవత్సరంలో సెంటర్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద తెలంగాణకు రావాల్సిన 495.20 కోట్ల రూపాయల నిధులను పొరపాటున ఆంధ్ర ప్రదేశ్ ఖాతాలో జమ చేశారని- వాటిని తమకు బదలాయించాలని అన్నారు.
రాష్ట్ర విభజన చోటు చేసుకున్న తొలి ఆర్థిక సంవత్సరంలోనే కేంద్ర ప్రభుత్వం చేసిన పొరపాటు వల్ల 495.20 కోట్ల రూపాయలను తాము కోల్పోయామని హరీష్ రావు చెప్పారు. జనాభా నిష్పత్తి ప్రాతిపదికన ఈ నిధులను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు మంజూరు చేసినందని ఆయన గుర్తు చేశారు. నిధులను ఏపీకి బదలాయించి- ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ.. ఇంకా సర్దుబాటు చేయకపోవడం వల్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు.
ఈ విషయంపై తాము ఇప్పటికే పలుమార్లు లేఖ రాశామని అయినప్పటికీ ఎలాంటి సానుకూల స్పందన రాలేదనే విషయాన్ని ఆయన నిర్మల సీతారామన్ కు గుర్తు చేశారు. ఏపీ అకౌంటెంట్ జనరల్ వద్ద కూడా ఈ విషయాన్ని ప్రస్తావించామని పేర్కొన్నారు. ఇప్పటికైనా స్పందించి సీఎస్ఎస్ నిధులను తమ అకౌంట్ లో జమ చేయాలని హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. కేంద్రం వద్దే పొరపాటు జరిగిన నేపథ్యంలో- వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని, దీన్ని సరిదిద్దాలని అన్నారు.