తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల: రేపట్నుంచే దరఖాస్తులు, పరీక్ష ఎప్పుడంటే?
హైదరాబాద్: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET)కు నోటిఫికేషన్ విడుదలైంది. సెప్టెంబర్ 15న టెట్ పేపర్-1, పేపర్-2 పరీక్షలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 27న ఫలితాలు విడుదల చేయనున్నారు. రేపట్నుంచి అంటే ఆగస్టు 2వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
పేపర్-1 పరీక్షకు డీఈడీ, బీఈడీ అభ్యర్థులు ఇద్దరూ రాసుకునే అవకాశం కల్పించారు. బీఈడీ అర్హత కలిగిన అభ్యర్థులు పేపర్-2తోపాటు పేపర్-1 పరీక్ష కూడా రాసుకోవచ్చు. కాగా, ఇటీవల జరిగిన సమావేశంలో టెట్ నిర్వహణకు మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఎస్సీఈఆర్టీ అధికారులు టెట్ నిర్వహణపై ప్రతిపాదనలు రూపొందించి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణకు అందజేశారు. ఆయా ప్రతిపాదనలను విద్యాశాఖ ఆమోదించగా.. టెట్ నిర్వహణపై అధికారులు కసరత్తు చేసి నోటిఫికేషన్ను రిలీజ్ చేశారు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభం: ఆగస్టు 2
దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 16
రాతపరీక్ష: సెప్టెంబర్ 15
పేపర్-1: ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు
పేపర్-2: మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు
పరీక్ష ఫీజు: రూ.400
దరఖాస్తు ఆన్లైన్లో దరాఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ https://tstet.cgg.gov.in ను సంప్రదించవచ్చు.
తాజా అంచనాల ప్రకారం రాష్టంలో 1.5 లక్షల డీఎడ్, 4.5 లక్షల మంది బీఎడ్ అభ్యర్థులున్నారు. 2017 టీఆర్టీ నోటిఫికేషన్ ద్వారా 8,792 టీచర్ పోస్టులను భర్తీచేశారు. గతంలో టెట్కు 7 సంవత్సరాల వ్యాలిడిటీ ఉండగా, రెండేళ్ల క్రితం టెట్ వ్యవధిని జీవితకాలం పొడిగించారు. గతంలో సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు పోటీపడే అవకాశం డీఎడ్ వారికే ఇవ్వగా.. ఇటీవలే బీఈడీ వారికి కూడా అవకాశం కల్పించారు. దీంతో గతంలో టెట్ క్వాలిఫై అయిన వారితో పాటు బీఈడీ అభ్యర్థులకు ఉపశమనం కలిగింది. ఈ క్రమంలో టెట్ పరీక్ష కోసం భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications